సూర్యాపేట అర్బన్, జూలై 8 : ఏండ్ల తరబడి తెగిన కట్టలు, నిండా కంపచెట్లతో దర్శనిచ్చిన చెరువులను మిషన్ కాకతీయతో పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వాటి పరిరక్షణకు పకడ్బందీగా సిద్ధమవుతున్నది. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నది. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించింది. మొత్తం 1,340 చెరువులకు గాను ఇప్పటికే 730 చోట్ల పూర్తి చేసింది. దాంతో చెరువు విస్తీర్ణం, హద్దులను గుర్తించడంతోపాటు నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఏర్పడుతున్నది. చేపల పిల్లల పెంపకం పారదర్శకంగా సాగడంతోపాటు మత్స్యకారులకు మెరుగైన ఉపాధి లభించనున్నది.
జియో ట్యాగింగ్తో పూర్తి రక్షణ
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునురుద్ధరించినా.. కొందరు అక్రమార్కులు చెరువు శిఖాన్ని ఆక్రమిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టి చెరువులను రక్షించేందుకు జియో ట్యాంగింగ్ చేస్తున్నారు. దీని ద్వారా చెరువుల విస్తీర్ణం, ప్రాంతం, ఆక్రమణకు గురైందా అనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. జియో ట్యాగింగ్తో రానున్న రోజుల్లో చెరువులకు పూర్తి రక్షణ ఏర్పడనున్నది.
చేప పిల్లల పంపిణీలో అక్రమాలకు చెక్
జియో ట్యాగింగ్తో అనేక రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రభుత్వం మత్స్యకారులకు అందించే చేప పిల్లల పంపిణీలో అక్రమాలు జరుగకుండా నివారించేందుకు జియో ట్యాగింగ్ ఉపయోగపడనున్నది. నీరు లేని చెరువులలో కూడా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పి బిల్లులు స్వాహా చేయడాన్ని జియో ట్యాగింగ్ ద్వారా అరికట్టవచ్చు. ఈ నిర్ణయంతో జిల్లాలోని 142 మత్స్య సహకార సంఘాలలోని 15,200 మంది మత్స్యకారులకు ప్రయోజనం కలుగనున్నది.
730 చెరువులకు పూర్తి
జిల్లాలోని 1340 చెరులకు గానూ అధికారులు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 730 చెరువులకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. ఇప్పటికే గుర్తించిన మండలాల్లోని చెరువులకు ట్యాగింగ్ పూర్తి చేసిన అధికారులు పక్కాగా ఆన్లైన్లో చెరువుకు సంబంధించిన వివరాలు ట్యాగ్ చేస్తున్నారు. జీయో ట్యాగింగ్తో ఆ చెరువులో చేప పిల్లలను విడుదల చేశారా లేదా అనే విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంది.
జియోట్యాగింగ్తో చెరువులకు రక్షణ
చెరువులకు జియో ట్యాగింగ్తో వాటి సమాచారం అందుబాటులో ఉండడంతో పాటు రక్షణ కలుగుతుంది. ఇప్పటికే జిల్లాలో 730 చెరువులకు ట్యాగింగ్ పూర్తి చేశాం. మిగిలిన వాటికి కూడా త్వరలో చేస్తాం. ట్యాగింగ్తో చెరువుకు సంబంధించిన అంశాలు మొబైల్ ద్వారా అన్లైన్లో తెలుసుకునే అవకాశం ఉంది. చేప పిల్లల పంపిణీ సమయంలో అక్రమాలను గుర్తించవచ్చు.
సౌజన్య, జిల్లా మత్స్యశాఖ అధికారి, సూర్యాపేట
జియో ట్యాగింగ్ ఉపయోగాలు