రామగిరి, ఏప్రిల్ 8 : ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి అండగా నిల్చింది తెలంగాణ సర్కార్. కరోనాతో స్కూళ్లు మూతబడగా ప్రైవేట్లో పనిచేసే టీచర్లు జీతాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో దేశ చరిత్రలోనే సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఒక్కొక్కరికి రూ.2 వేలలతోపాటు 25 కిలోల బియ్యం అందిస్తామని ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన 740 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా 15,270 మందికిపైగా ఉపాధ్యాయులు, సిబ్బందికి లబ్ధి కలుగనుంది. దీంతో ఆయా కుటుంబాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి జిల్లాలో 740 ప్రైవేట్ పాఠశాలలు
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 740 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలున్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 373, సూర్యాపేట జిల్లాలో 213, యాదాద్రి భువనగిరి జిల్లాలో 154 ఉన్నాయి. ఇందులో సుమారు 15, 270మందికి పైగా ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనతో వీరికి పూర్తి భరోసా లభించినట్లయ్యింది. ప్రతినెలా రూ. 2వేలతోపాటు 25 కిలోల బియ్యం ఇవ్వనుండడంతో ఎంతో మేలు చేసినట్లుగా భావిస్తున్నారు.
ట్రస్మా సంబురాలు
ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తూ గురువారం రాత్రి ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండలోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ గుత్తాకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. వారి వెంట కేజీ టు పీజీ విద్యా సంస్థల రాష్ట్ర చైర్మన్ గింజల రమణారెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థల వ్యవహకర్తలు, ఉపాధ్యాయులు అలుగుబెల్లి తిరుమల్రెడ్డి, అలుగుబెల్లి భరత్కుమార్రెడ్డి, పర్వత్రెడ్డి, చారి, శ్రీనివాస్, సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలవాలి