బొడ్రాయిబజార్, మే 7 :కరోనా విజృంభిస్తున్న సమయంలో బాధితులకు సేవలు అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. మహమ్మారి భయంతో ఆత్మీయులు సైతం దూరమవుతున్నా తమ వంతు సాయం అందిస్తూ ఆపద్బాంధవులై నిలుస్తున్నారు. ఆకలి తీర్చడంతో పాటు వైద్య సేవలకు సిద్ధంగా ఉంటున్నారు. సఫాయీ కార్మికులు సైతం బాధితుల ఇండ్లకు వెళ్లి హైపోక్లోరైట్ పిచికారీ చేస్తున్నారు.
ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఇంటికే ఆహారం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొవిడ్ కేసులు పెరుగుతుండగా చాలామంది కుటుంబ సభ్యులకు దూరంగా ఐసొలేషన్లో ఉంటున్నారు. వారికి ఆహారాన్ని అందించేందుకు పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘాలు ముందుకొచ్చాయి. పేద, మధ్య తరగతి ఆర్యవైశ్యులకు ఆహారం అందిస్తున్నాయి. సెల్ నంబర్లకు లొకేషన్ను షేర్ చేస్తే చాలు.. ఆహారం సిద్ధం చేసి పంపిస్తున్నాయి. నిత్యం 20 నుంచి 30 మందికి అందిస్తున్నాయి. ఆహారం కావాల్సిన వారు 7674891112, 9985902233 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి.
ఆన్లైన్లో సలహాలిస్తున్న రామ్మూర్తి యాదవ్
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంతాల కరోనా బాధితులకు ఆన్లైన్లో ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పేషెంట్ల ఇబ్బందులు తెలుసుకొని తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అవసరమున్న వారికి ఆక్సిజన్ కూడా పెడుతున్నారు. ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తే కరోనా బారి నుంచి బయటపడొచ్చని ధైర్యం చెబుతున్నారు. కరోనా బాధితులు ఎలాంటి అనుమానాలు, సందేహాలున్నా తనను 98480 94969 నంబర్లో సంప్రదించాల్సిందిగా తెలిపారు.
కరోనా బాధితుల ఇండ్లల్లో సఫాయన్నల సేవలు
కరోన బారిన పడిన కుటుంబాలు, మృతి చెందిన వారి ఇండ్లలో సఫాయీ కర్మచారీలు ఉచితంగా సేవలు చేస్తున్నారు. ఆయా ఇండ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. బయటకు చెప్పుకొనేందుకు ఇబ్బంది పడుతున్నవారు 8919646991, 7993408287, 9182248098 నంబర్లకు ఫోన్ చేస్తే నేరుగా ఇంటికే వచ్చి సేవలు అందిస్తామని చెప్తున్నారు.