పెద్దవూర, ఏప్రిల్ 7 : ప్రజల కష్ట, సుఖాల్లో తోడుండేది టీఆర్ఎస్సే.. ఓట్లు వేయించుకుని వెన్నుచూపం.. ప్రజల మధ్యనే ఉండి పరిపాలిస్తాం.. అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం రాత్రి పెద్దవూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధూంధాం కార్యక్రమానికి మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ గతంలో ఓట్లు వేయించుకొని మళ్లీ ఐదేండ్ల పాటు కన్పించని చరిత్ర కాంగ్రెస్ నాయకుదని.. కానీ, ప్రజల కష్టసుఖాల్లో తోడుండేది టీఆర్ఎస్సే అని పేర్కొన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గంతో పాటు నల్లగొండ జిల్లా రైతాంగాన్ని నట్టేట ముంచారని మండిపడ్డారు. అన్నిసార్లు మంత్రి, ఎమ్మెల్యే పదవులను చేపట్టి ఏనాడైనా ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రైతాంగాన్ని కరువు కోరల్లోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీయే అని, పక్కన కృష్ణమ్మ ఉన్నా.. నమ్ముకున్న ప్రజలకు తాగు, సాగు నీరివ్వలేని చేతగాని పాలకులని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఎదిగారే తప్ప ప్రజలు కుంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 60ఏండ్ల పాలనలో వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు నష్టాల పాలయ్యారని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా మార్చిందని తెలిపారు. 2014నాటికి కనీసం 6గంటలు కరెంటు ఇవ్వలేని పరిస్థితి నుంచి నేడు 24గంటలు నిరంతరాయంగా ఇస్తున్న ఘనత టీఆర్ఎస్దేనని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం రోజురోజుకూ నిత్యావసరాల ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఆశీర్వదించి పంపిన నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వ విప్, ఉప ఎన్నికల మండల ఇన్చార్జి బాల్క సుమన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, పార్టీ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ చెన్ను అనూరాధా సుందర్రెడ్డి, గోనె విష్ణువర్ధన్రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్రెడ్డి, వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, నడ్డి లింగయ్య, లక్ష్మయ్య, హైమద్ అలీ పాల్గొన్నారు.
40వేల ఓట్లతో విజయం మనదే : మంత్రి తలసాని
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 40వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తాడని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఏలిన జానారెడ్డి పదవులు పొందారే తప్ప ప్రజాసమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. హాలియా, నందికొండలో రోడ్లు కూడా సరిగా లేవని, అడుగడుగునా సమస్యలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయించుకుని వారు ఎదిగారే తప్ప ప్రజలను, సంక్షేమాన్ని పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య రెండేండ్లలో ఎన్నో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారని తెలిపారు. హాలియాకు డిగ్రీ కళాశాలతో పాటు నెల్లికల్లు లిఫ్టు సహా పలు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆయన మృతి బాధాకరమని, తన ఆశయాలను భగత్ నెరవేరుస్తారని చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి భగత్ను గెలిపించాలని కోరారు.
బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట : మంత్రి శ్రీనివాస్గౌడ్
బడుగు, బలహీన వర్గాలకు టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందని, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. 35సంవత్సరాలు అధికారంలో ఉన్నా జానారెడ్డి ఏనాడైనా పేద ప్రజలను పట్టించుకున్నారా..? వైద్యానికి డబ్బులిచ్చాడా..? పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పది రూపాయలు సాయం చేశాడా..? అనారోగ్యంతో బాధపడ్డ వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాడా..? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. యువకుడు, ఉత్సాహవంతుడు, బడుగు బలహీన వర్గాల బిడ్డగా మన భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇవీ కూడా చదవండీ…
ఆడబిడ్డలకు వరం.. కల్యాణ లక్ష్మి
టీఆర్ఎస్ గెలుపుతోనే సాగర్ అభివృద్ధి : ఎమ్మెల్యే చందర్