విచ్చుకత్తులు గట్టిన వివక్ష.. ఆరు దశాబ్దాల ఆకాంక్షపై ఉక్కుపాదం మోపిన కాలాన.. తెలంగాణ ఆత్మగౌరవ పత్రికగా పురుడు పోసుకున్న నమస్తేతెలంగాణ దిగ్విజయంగా పదేండ్లు పూర్తిచేసుకున్నది. నాడు చంటి బిడ్డలా గుండెలకు హత్తుకున్న నాలుగు కోట్ల జనం సంకల్పాన్ని భుజానికెత్తుకుని నడిసొచ్చిన కొడుకులా నిలబడింది. సీమాంధ్ర మీడియా ఏకమై అసత్యపు రాతలతో విద్వేషపు బుసలు కొడుతున్న వేళ.. ప్రత్యేక ఉద్యమానికి, ఉద్యమకారులకు సింగిల్ కాలమ్ స్పేస్ కూడా ఇవ్వని సమయాన.. వాస్తవాలను, తెలంగాణ వాయిస్ను పతాక శీర్షికలకు ఎత్తింది. ఇతర పత్రికలు సైతం మన వార్తలకు ప్రాధ్యామివ్వక తప్పని పరిస్థితిని ఏర్పర్చింది. నాటి పాలకుల కుట్రలకు కుంగి ప్రత్యేక రాష్ట్రం రాదేమోనని యువత బలిపీటం ఎక్కుతుంటే.. ‘మీరు లేని తెలంగాణ దేనికోసం.. బరిగీసి సాధించుకుందాం’ అంటూ ధైర్యం నూరిపోసింది. మరుగునపడేసిన బతుకమ్మకు తీరొక్క పదాలను పేర్చి మన సాంస్కృతిక వైభవాన్ని ఎల్లలు దాటించింది. ఆత్మగౌరవ బోనాలకు అక్షరాల బొట్లు పెట్టింది. శ్రీశైలం నుంచి పులిచింతల దాకా సాగునీటి ప్రాజెక్టుల్లో మనకు జరిగిన అన్యాయాలను, నిధులు, నియామకాల్లో కుట్రలను విప్పిచెప్పి జాతిని జాగృతం చేసింది. రెండు కండ్ల సిద్ధాంతాలు, రెండు నాల్కల ధోరణితో వ్యవహరించిన నాయకులను నిగ్గదీసి ప్రజా బోనులో నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనిర్వచనీయ పాత్రను పోషించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని ప్రత్యేక రాష్ట్రంలోనూ బంగారు తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను నమస్తే తెలంగాణ కొనసాగిస్తున్నది. మలిదశ ఉద్యమ అమరుల కుటుంబాలకు సహాయ నిధితో అండగా నిలిచింది. ఆపన్నుల కష్టాలను ప్రచురించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. పోలీస్, హెల్త్, రెవెన్యూ, అగ్రికల్చర్, ఐసీడీఎస్.. ఇలా శాఖ ఏదైనా అవినీతిని తూర్పార పట్టి అక్రమార్కులకు తగిన శాస్తి చేసింది. స్వరాష్ట్ర స్వప్నాలు ఒక్కటిగా సిద్ధిస్తున్న వేళ వాటి ఫలాలను విశ్లేషణాత్మక కథనాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతున్నది. ప్రతిష్టాత్మక పథకాలను లబ్ధిదారులకు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తూనే.. అమలులో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి అప్రమత్తం చేస్తున్నది. రూపురేఖలను తీర్చిదిద్దుకుంటున్న గ్రామాలను పల్లెప్రగతి శీర్షికతో ప్రోత్సహిస్తున్నది. కరోనా పరిస్థితుల్లో అవగాహన కల్పించే అనేక కథనాలను పాఠకుల ముందుంచుతున్నది. ‘నమస్తే డాక్టర్’ ఫోన్ ఇన్తో ఉచితంగా వైద్య సలహాలు అందిస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, జూన్ 5(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పత్రికగా ఉద్యమ సమయంలో పురుడుపోసుకున్న ‘నమస్తే తెలంగాణ’ దిగ్విజయంగా దశాబ్దకాలం పూర్తి చేసుకున్నది. నాడు ఉద్యమ గొంతుకగా, నేడు ప్రగతి కాముఖ పత్రికగా సాగిస్తున్న అక్షరయాత్రకు నేటితో పదేళ్లు నిండాయి. ఉద్యమకాలంలో సీమాంధ్ర మీడియా కుట్రలను, కుతంత్రాలను ఛేదిస్తూ స్వరాష్ట్ర సాధనకు ఊపిరిలూదిన పత్రికగా నిలదొక్కుకుని నేడు తనదైన శైలిలో అక్షరసమరం సాగిస్తున్నది. నాటి ఉద్యమ ఆకాంక్షలు స్వరాష్ట్ర పాలనలో ఒక్కొక్కటిగా నెరవేరుతున్న వేళ వాటి ఫలాలను, ఫలితాలను ప్రజలకు పట్టి చూపడంలో తనదైన శైలితో ముందుకు సాగుతున్నది. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘నమస్తే తెలంగాణ’ ఎన్నో సంచలనాత్మక, విశ్లేషణాత్మక కథనాలతో ప్రజల ఆదరణను పొందింది.
సంచలన కథనాలు.. వెల్లువలా స్పందనలు…
పదేళ్ల అక్షర యాత్రలో ఎన్నెన్నో సంచలన కథనాలు అందించింది నమస్తే తెలంగాణ. నేటికీ అదే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నది. అవినీతి, అక్రమాలపై ఈ పదేండ్లలో ప్రచురితమైన అనేక సంచలన కథనాలకు స్పందన వెల్లువెత్తింది. ‘కబ్జా కోరల్లో కోదాడ చెరువు’ సహా.. అక్కడే ప్రభుత్వ భూముల ఆక్రమణకు సిద్ధమైన వ్యవహారాన్ని సైతం నమస్తే ప్రత్యేక కథనాలతో ఎలుగెత్తి చాటింది. సంస్థాన్ నారాయణపురంలో స్టేషన్కు వచ్చిన మేకలనే మేసిన ఖాకీల కథనాన్ని ఎండగట్టడంతో.. మరునాడే బదిలీ వేటు పడింది. గరిడేపల్లి మండలంలో చనిపోయిన వాళ్ల పేర్లతోనూ ఆసరా పింఛన్లు ఎత్తుకుంటున్న వైనాన్ని కళ్లకు కట్టడంతో.. స్పందించిన అధికారులు జిల్లా అంతటా వెయ్యికి పైగా అనర్హులను వెలికితీశారు. మఠంపల్లిలో దేవుడికే శఠగోపం సహా.. యూరియా బ్లాక్ దందాపై గతేడాది నమస్తే సంధించిన వార్తా కథనాలు యంత్రాంగంలో చలనాన్ని తీసుకొచ్చాయి. ఎరువులు, విత్తనాల సరఫరాలో అలసత్వంపై నమస్తే కథనంతో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి.. సంబంధిత అధికారులను సమీక్షలో ప్రశ్నించారు. జిల్లాలోని ఏకైక మహిళా దూర విద్య కేంద్రానికి మంగళంపాడే ప్రయత్నం నమస్తే కథనంతోనే నిలిచిపోయిన సంగతి పత్రికా పాఠకులకు విదితమే. సూర్యాపేట ట్రెజరీలో జరిగిన కోట్ల రూపాయల అవినీతిని బట్టబయలు చేసింది. భూ సమస్యలను ధర్మగంట ప్రత్యేక శీర్షిక ద్వారా ప్రస్తావిస్తూ అధికారుల్లో కదలికలను తీసుకువచ్చింది. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో కొందరు అధికారుల చేష్టలతో ఇబ్బందులకు గురైన రైతులకు ధర్మగంట ఓ వెలుగురేఖగా మారిందనడంలో సందేహం లేదు. తప్పుడు పద్ధతులకు అలవాటు పడిన అధికారులు, సిబ్బంది తీరును నిలదీయడంలో సాహాసాన్ని ప్రదర్శించి రైతుల మన్ననలను పొందింది.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా..
ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపింది. సీమాంధ్ర పాలనలోని నిర్లక్ష్యపు ధోరణిని ఎత్తి చూపుతూ.. నేడు ఎలా సరిచేసుకుంటూ వస్తున్నారో కూడా ప్రజలకు అర్థమయ్యేలా అనేక కథనాలను ప్రచురించింది. ప్రభుత్వ పథకాలైన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, భగీరథ లాంటి చారిత్రాత్మక పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో పాటు అనేక విభిన్న ఆలోచనలతో సాగుతున్న పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంలోనూ విశేష కథనాలతో నమస్తే తనదైన పాత్రను నిర్వహిస్తున్నది. గతంలో ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ధర్మగంట పేరుతో ప్రచురించిన కథనాలు ఎన్నో భూసమస్యలకు దిక్సూచిగా నిలిచాయి. మారుమూల పల్లెల్లో రెవెన్యూ వ్యవస్థలోని కొందరి వ్యవహారంతో ప్రజలు ఇబ్బందులను ఎలుగెత్తి చాటి రైతుల మన్ననలు పొందింది. ప్రస్తుతం అమలు చేస్తున్న కొత్త రెవెన్యూ చట్టం, ధరణి లాంటి కొత్త పథకాలతో వ్యవసాయ భూముల వివాదాలు చెక్ పెడుతున్న తీరును సైతం ప్రజలకు వివరించడంలో కీలకపాత్ర పోషించింది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో జరుగుతున్న మేలును, సాగర్ నీటి వాటాలో నిక్కచ్చిగా మనం వాడుకుంటున్న తీరు, ఎత్తిపోతల పథకాల పట్ల ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్దే ప్రభుత్వ ఆలోచనకు మద్దతుగా ప్రచురించిన కథనాలు బాధిత ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని నింపాయి. ఉమ్మడి జిల్లాను పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న యోచనతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలుగా విభిజించినప్పుడు చేకూరిన ప్రయోజనాలను ప్రజలకు వివరించింది. ఇదే సమయంలో కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పాటు సమయంలోనూ ప్రభుత్వ ఆశయాన్ని వివరిస్తూ పాలన సౌలభ్యాన్ని ప్రజలకు చేరవయడంలోనూ నమస్తే కథనాలు ఎంతో తోడ్పడ్డాయి. ఇక పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా నెలనెలా వేల కోట్ల రూపాయలతో రూపురేఖలే మారిపోతున్న పరిస్థితులపైనా పల్లెల్లో ప్రగతి వికాసాలపై నిరంతరం కథనాలు కొనసాగిస్తున్నది. ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటును అందుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పాలకవర్గాలపైనా గురిపెట్టి అక్షర సమరం సాగించి తనదైన శైలిని ప్రదర్శించింది. అంతిమంగా ప్రజోపయోగ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి సక్రమంగా అమలయ్యేలా నిరంతరం నీడలా వెన్నంటి ఉంటున్నది.
పదో వసంతంలో…
కరోనా సమయంలోనూ తనదైన శైలిలో ప్రజోపయోగ కథనాలతో ముందుకు సాగింది. ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వ సేవలను వివరిస్తూ నిరంతరం ప్రజల వెంట ఉండేందుకు శ్రమించింది. వివాహాలు, శుభకార్యాలే కరోనా వ్యాప్తికి కేరాఫ్గా నిలిచాయంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కథనాలను ప్రచురించింది. దేశసరిహద్దుల్లో కల్నల్ సంతోష్బాబు వీరమరణంపై దేశభక్తి ఉప్పొంగే కథనాలతో ప్రత్యేకతను చాటుకున్నది. ఫ్లోరైడ్ రహిత జిల్లాగా నల్లగొండను కేంద్రం గుర్తించడంలో ప్రత్యేక కథనాలను ప్రచురించింది. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా తీసుకున్న చర్యలు… వాటి ఫలితాలతోనే ఇది సాధ్యమైందంటూ ఉద్యమఫలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. రాష్ట్ర రెవెన్యూ చరిత్రలో నవశకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ చట్టం, ధరణి ఫోర్టల్ రూపకల్పన లాంటి వాటి సమగ్ర వివరాలను, నిపుణుల విశ్లేషణలను ప్రజలకు చేరవేయడంలో ప్రజాపత్రికగా తనదైన శైలిని కొనసాగించింది. సదుద్దేశంతో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ను దుర్వినియోగం చేయాలని చూస్తే ఉక్కుపాదం పేరుతో ప్రచురించిన కథనాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇక రాజస్థాన్ కేంద్రంగా ‘ఫేస్బుక్ ఫేక్ముఠా’ అంటూ నిఘా కథనం ప్రజల్లో చైతన్యం కలిగించింది. ఇక రెండో దశ కరోనాలోనూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ నమస్తే కథనాలు ప్రచురిస్తున్నది. ఎప్పటికప్పుడు జిల్లా ప్రజాప్రతినిధుల, అధికారులతో ప్రత్యేక ఇంటర్వ్యూలతో తనదైన శైలిని కొనసాగిస్తున్నది.