నల్లగొండ ప్రతినిధి, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ పరిస్థితుల్లో నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మరో కీలక సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ బయటి నుంచి ఆక్సిజన్ను దిగుమతి చేసుకుంటుండగా, ఇకపై ఆస్పత్రి ఆవరణలోనే ఉత్పత్తి కానున్నది. 24 గంటల ఉత్పత్తితోపాటు నేరుగా పైప్లైన్ ద్వారా బెడ్ల దాకా సరఫరా చేసే ప్లాంటును
ఎన్హెచ్ఏఐ-డీఆర్డీఓ శుక్రవారం అందుబాటులోకి తెచ్చాయి. వాతావరణంలోని గాలిని పీల్చుకుని వ్యర్థ్ధాలను వేరు చేసి వైద్య సేవల్లో ఉపయోగించే స్వచ్ఛమైన ఆక్సిజన్ ఈ ప్లాంట్లో తయారుకానున్నది.
పీఎం కేర్ నిధులతో
తెలంగాణ వైద్యారోగ్య సదుపాయాల కల్పన సంస్థ పర్యవేక్షణలో ఎన్హెచ్ఏఐ-డీఆర్డీఓ రికార్డు సమయంలో నిర్మాణం పూర్తిచేసి ఆస్పత్రి వర్గాలకు అప్పగించాయి. ఇది రాష్ట్రంలోనే ప్రప్రథమం కాగా.. సూర్యాపేట, దేవరకొండ ఆస్పత్రుల్లోనూ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో సర్కారు దవాఖానాల్లో వైద్యసేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పనిచేస్తుంది. గతంతో పోలిస్తే అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంతకంతకూ పెరుగుతున్న అవుట్ పేషెంట్ల సంఖ్యనే నిదర్శనం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ప్రత్యేకంగా మెడికల్ కాలేజీలను మంజూరు చేయడంతో వాటి అనుబంధంగా జిల్లా కేంద్ర దవాఖానల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక కరోనా నేపథ్యలో మరింత ప్రత్యేక శ్రద్ధతో ఆస్పత్రుల్లో అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించారు. సీటీ స్కాన్ నుంచి మొదలుకుని అన్నిరకాల పరీక్షలు సైతం ఇక్కడే చేసేలా యంత్రపరికరాలను అందజేశారు. వీటితోపాటు ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్ సదుపాయాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఆక్సిజన్ సరఫరాను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత ఏడాది చివరలో 13 కిలోలీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంటులు అందుబాటులోకి తెచ్చారు. అయితే దీనికి బయటి నుంచి లిక్విడ్ ఆక్సిజన్ను తెచ్చి నింపి అక్కడి నుంచి ఆక్సిజన్ బెడ్ల వద్దకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ వార్డుల్లోని 180బెడ్లకు ఈ ప్లాంట్ నుంచే ఆక్సిజన్ సరఫరా అవుతున్నది. ఇదే సమయంలో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుపై దృష్టి సారించారు.
ఎన్హెచ్ఏఐ, డీఆర్డీఓ సంయుక్త ఆధ్వర్యంలో..
నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం కోసం పీఎం కేర్స్ నుంచి నిధులు కేటాయించారు. ఈ నిధులతో ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ నమూనా రూపొందించడంతోపాటు దాన్ని అభివృద్ధి చేయడం డీఆర్డీఓ చేపట్టింది. డీఆర్డీఓ ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ దీన్ని తయారుచేసింది. తర్వాత క్షేత్రస్థాయిలో ఈ ప్లాంట్ను నిర్మించేందుకు భారత జాతీయ రహదారుల విభాగం(ఎన్హెచ్ఏఐ) సంస్థ ముందుకొచ్చింది. నల్లగొండ ఆస్పత్రి ఆవరణలో కేవలం 20రోజుల్లోనే రికార్డుస్థాయి సమయంలో ఈ ప్లాంట్ను పూర్తిచేశారు. ఎన్హెచ్ఏఐ పీడీ నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో సివిల్, ఎలక్ట్రిసిటీ పనులు వారం రోజుల్లోనే పూర్తయ్యాయి. తర్వాత ప్లాంట్ ఎరక్షన్ వర్క్, ఇన్స్టాలేషన్ పనులను డీఆర్డీఓ సిబ్బంది పూర్తి చేశారు. ఈ ప్రక్రియ మొత్తం రెండు వారాల్లోనే పూర్తి కాగా మిగతా పనులు చకచకా పూర్తి చేశారు. దీంతో నల్లగొండ ఆస్పత్రిలో 1000ఎల్పీఎం కెపాసిటీ కలిగిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకున్నట్లయ్యింది. ప్రస్తుతం దీన్ని ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వాడాలని ఆస్పత్రి వర్గాలు నిర్ణయించారు. దీంతో అందులోని 120 బెడ్లకు నిరంతరాయంగా ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చినట్లయ్యింది.
వాతావరణంలోని గాలిని తీసుకుంటూ..
వాతావరణంలోని గాలిని తీసుకుంటూ దాని నుంచే స్వచ్ఛమైన ఆక్సిజన్ను తయారు చేయడం ఈ ప్లాంట్ ప్రత్యేకత. ఇప్పటివరకు లిక్విడ్ ఆక్సిజన్ను తీసుకొచ్చి ఆస్పత్రి ఆవరణలోని ట్యాంక్లోకి నింపి అక్కడి నుంచి రోగుల బెడ్లకు సరఫరా చేస్తున్నారు. ఈ ప్లాంట్ సాధారణ గాలిని తీసుకొని దాని నుంచి వ్యర్థాలను వేరుచేసి స్వచ్ఛమైన ఆక్సిజన్ను ప్లాంట్లోని ట్యాంకులోకి వెళ్తుంది. అక్కడి నుంచి పైప్లైన్ల ద్వారా ఆక్సిజన్ బెడ్లకు సరఫరా అవుతుంది. ఇందులో 94శాతానికి పైగా స్వచ్ఛత ఉంటుందని డీఆర్డీఓ వర్గాలు తెలిపాయి.
నల్లగొండ నుంచే ప్రారంభం
రాష్ట్రంలోనే తొలిసారిగా నల్లగొండ ఆస్పత్రిలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చాం. పీఎం కేర్స్ నుంచి నిధులు కేటాయించగా ప్లాంట్ల డిజైన్ను డీఆర్డీఓ రూపొందించింది. డీఆర్డీఓ ఇచ్చిన డిజైన్కు అనుగుణంగా టాటా సిస్టమ్స్ సంస్థ మిషన్లను తయారు చేసింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలో వీటిని ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో నిర్దేశించిన ఆస్పత్రుల ఆవరణల్లో నిర్మిస్తున్నాం. అక్కడికక్కడే ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ప్రత్యేకత.
-నాగేశ్వర్రావు, ఎన్హెచ్ఏఐ పీడీ
మెరుగైన వైద్యసేవలకు ఆస్కారం
నల్లగొండ ఆస్పత్రికి ఆక్సిజన్ తయారీ ప్లాంట్ ఓ వరం లాంటిది. కరోనా నేపథ్యంలో ఈ ప్లాంట్తో మరిన్ని మెరుగైన వైద్య సేవలకు ఆస్కారం కలిగింది. ఇక్కడే తయారీ, సరఫరా వ్యవస్థలను కలిగిన ఈ ప్లాంట్తో ఆక్సిజన్ కొరతను అధిగమించినట్లే. ప్లాంట్ ద్వారా ఆక్సిజన్ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఆస్పత్రిలో అవసరమైన మేరకు దీనిని వినియోగిస్తాం.
-డాక్టర్ రాథోడ్ జైసింగ్, ఆస్పత్రి సూపరింటెండెంట్, నల్లగొండ