గుర్రంపోడ్, జూన్ 4 : ధాన్యం కొనుగోళ్లను మూడు రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు.
చివరి గింజవరకూ కొంటాం
మునుగోడు (చండూరు)/నాంపల్లి: రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేస్తామని, అన్నదాతలు ఆందోళన పడొద్దని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆరు లారీల ద్వారా మిల్లులకు ధాన్యం రవాణా చేస్తుండగా, అదనంగా మరో లారీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ యార్డుల్లో కలిపి మొత్తం 375 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. వీటి ద్వారా రాష్ట్రంలోనే అత్యధికంగా 7.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేశామన్నారు. ధాన్యం విక్రయించిన సుమారు 1.05లక్షల మంది రైతులకు రూ.1,000కోట్లు చెల్లించామని వివరించారు.
జిల్లాలో ఇంకా మిగిలి ఉన్న 20వేల నుంచి 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరో 3 రోజుల్లోగా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కోతల ఆలస్యం, మిల్లుల సామర్థ్యానికి మించి దిగుబడి రావడం, అకాల వర్షాలు, తదితర కారణాల వల్ల కొన్ని కేంద్రాల్లో ధాన్యం తరలింపులో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. మిల్లుల్లో ధాన్యం నిల్వ చేసేందుకు ఖాళీ లేకపోవడంతో మార్కెట్యార్డు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములు, ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్రావు, సహాయ అధికారి నిత్యానందం, తాసీల్దార్ మహేందర్రెడ్డి, ఎస్ఐ ఉపేందర్రెడ్డి, ఏఓ మల్లేశ్ తదితరులు ఉన్నారు. అనంతరం నాంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తాసీల్దార్ లాల్బహుదూర్, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి ఉన్నారు.