నల్లగొండ ప్రతినిధి, మే 3 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాను కాంగ్రెస్ కంచుకోటగా ఆ పార్టీ నేతలు భావించేవారు. కానీ 2014 ఎన్నికల నుంచి ఇక్కడ టీఆర్ఎస్ తన బలాన్ని అంతకంతకూ పెంచుకుంటూ వస్తోంది. ఆ ఎన్నికల్లో ఒక ఎంపీతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలను గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఏకపక్ష విజయాలే సాధించింది. మొత్తం 12అసెంబ్లీ స్థానాలకు గానూ తొమ్మిదింట్లో విజయం సాధించి తిరుగులేని సత్తా చాటింది. ఇక 2019 అక్టోబర్లో జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని రికార్డు మెజార్టీతో కైవసం చేసుకుంది. కాంగ్రెస్లో గెలుపొందిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరడంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తిరుగులేని హవా సాగింది.
టీఆర్ఎస్కు మరింత ఆదరణ..
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతుండడంతో ప్రజల్లో పార్టీ పట్ల మంచి ఆదరణ కనిపిస్తున్నది. పార్టీ సంస్థాగత నిర్మాణపరంగా చూసినా ఆరున్నర లక్షల మంది సభ్యులతో బలమైన పార్టీగా రూపుదిద్దుకుంది. ప్రతి పల్లెకు, ఆవాస ప్రాంతానికి, తండాకు సైతం టీఆర్ఎస్ విస్తరించింది. దీంతో ఏ ఎన్నికలు వచ్చినా పటిష్టమైన నాయకత్వంతో పాటు బలమైన క్యాడర్తో సునాయస విజయాలు సొంతం చేసుకుంటున్నది. ఈ మధ్యే జరిగిన పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి మరోసారి విజయఢంకా మోగించారు. ఈ స్థానం ఏర్పడిన నాటినుంచి టీఆర్ఎస్నే గెలుపొందుతూ వస్తున్నది. వరుసగా నాల్గోసారి, పల్లా రెండోసారి ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, మధ్యతరగతి, యువత, ఉన్నతవిద్యావంతులతో సంబంధం ఉన్న ఎన్నికలు అయినా టీఆర్ఎస్నే గెలుపొందింది. ఇదే ఉత్సాహంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు పార్టీ యావత్తు సిద్ధమైంది. పార్టీ అధినేత కేసీఆర్, యువనేత కేటీఆర్ మార్గదర్శనంలో సాగర్ ఎన్నికలను విజయవంతంగా ముగించారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఇందులో భాగస్వాములై ముందుకు నడిచారు.
పకడ్బందీగా ప్రచారం..
ఎక్కడా కూడా విపక్షాలకు చాన్స్ ఇవ్వకుండా పకడ్బందీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతోపాటు పోలింగ్ వరకు పార్టీ ఆసాంతం తీవ్రంగా శ్రమించింది. దీంతో పార్టీ అభ్యర్థి నోముల భగత్ మంచి మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని అతిచిన్న వయస్సులోనే భగత్ 18వేల పైచిలుకు మెజార్టీతో కంగు తినిపించారు. భగత్ విజయంలో క్షేత్రస్థాయిలోని సామాన్య కార్యకర్త మొదలు రాష్ట్రస్థాయి నేతల వరకు అందరూ భాగస్వాములుగా ఉన్నారు. పార్టీ అధినేత నుంచి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పుడూ పాటిస్తూ క్షేత్రస్థాయిలో అమలు చేసే పటిష్టమైన క్రమశిక్షణ కలిగిన పార్టీ యంత్రాంగం ప్రస్తుత రాజకీయాల్లో టీఆర్ఎస్కు మాత్రమే ఉండడం విశేషం. దీంతోనే సోమవారం నకిరేకల్ ఫలితాల్లోనూ టీఆర్ఎస్ తనదైన సత్తా చూపింది.
నకిరేకల్లోనూ గులాబీ జెండా..
కొత్తగా ఏర్పడిన నకిరేకల్ మున్సిపాలిటీలోనూ గులాబీ జెండానే ఎగిరింది. ఇక్కడ పార్టీలో సాంకేతికంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా… వాటన్నింటినీ అధిగమిస్తూ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఎవరి సహకారం లేకుండానే సొంతంగానే 20కి 20 స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యంలో పార్టీ ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు సహకారంతో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ యంత్రాంగాన్ని నడిపించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వ్యూహం వరకు అన్నీ సక్సెస్ఫుల్గా అమలు చేశారు. మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్నారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న నకిరేకల్ అభివృద్ధిలో జరగాల్సినంత జరగలేదన్నది వాస్తవం.
అయితే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరకల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, బస్టాండ్ ఆధునీకరణ, వైకుంఠధామం నిర్మాణం లాంటి పనులు పూర్తయ్యాయి. ఇంకా ప్రధాన రహదారుల ఆధునీకరణ, మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా కనెక్షన్లు, డిగ్రీ కాలేజీకి శాశ్వత భవనం, దవాఖానను వంద పడకలకు విస్తరణ లాంటి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చిన నకిరేకల్ ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో పార్టీ ముందుకు సాగింది. ప్రజలు కూడా దీనికి ఆమోదం తెలుపుతూ మెజార్టీ స్థానాలను కట్టబెట్టారు. మొత్తం 11స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలకు అవసరమైన మెజార్టీని సాధించింది. ఇక ఇదే సమయంలో టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు లోపాయికారిగా ఒక్కటై పరస్పర సహకారం తీసుకున్నాయి. అయినాసరే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎన్నికలు ఏవైనా సరే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్కు తిరుగలేదన్నది వరుస ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.