నల్లగొండ ప్రతినిధి, మే 3 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నది. మొత్తం 1,89,782 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు 89,804 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 70,932, బీజేపీ అభ్యర్థికి 7,676 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 18,872 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇంతటి భారీ తేడాతో జానారెడ్డి ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకు ముందు 10 సార్లు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన జానారెడ్డి మూడు సార్లు 8 వేల ఓట్ల లోపు తేడాతోనే ఓటమి పాలయ్యారు. 2018లోనూ నోముల నర్సింహయ్య చేతిలో 7,771 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కానీ ఈ ఉప ఎన్నిక వేదికగా సాగిన పోరులో జానారెడ్డికి ఓటర్లు భారీ షాక్ ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
పెరిగిన ఓటింగ్ శాతం
ఈ ఎన్నికల్లో పార్టీల వారీగా పోలైన ఓట్లను పరిశీలిస్తే టీఆర్ఎస్ తన బలాన్ని మరింత పెంచుకున్నట్లు స్పష్టమవుతున్నది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ జానారెడ్డి తిరుగులేని వ్యక్తిగా కొనసాగారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 89,804 ఓట్లతో 47.3 శాతం ఓట్లను సాధించింది. ఇది 2018తో పోలిస్తే ఒక శాతం అదనం. అప్పుడు టీఆర్ఎస్కు (83,743 ఓట్లు) 46.3 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోలిస్తే 5.2 శాతం ఓట్లను కోల్పోయింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి (70,932 ఓట్లు) 37.3శాతం ఓట్లను పొందింది. 2018లో ఆ పార్టీకి 76,017 ఓట్లతో 42.5 ఓటింగ్ శాతం నమోదు చేసుకుంది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ బలం మరింత పెరుగగా, కాంగ్రెస్ బలం మరింత పడిపోయింది. ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 43.2శాతం ఓటింగ్తో 68,125 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్కు 45.5శాతం ఓటింగ్తో 71,820 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ పరిస్థితి అప్పుడు ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1.48శాతం( 2,682 ఓట్లు), 2019 ఎంపీ ఎన్నికల్లో 3.1 శాతం (4,917 ఓట్లు) పొందితే తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 4 శాతం ఓటింగ్తో 7,676 ఓట్లను పొందగలిగింది. ఓటింగ్ శాతం పెంచుకోవడంలో భాగంగా ఈ సారి అభ్యర్థి ఎంపికలో చేసిన ప్రయోగం కూడా బెడిసికొట్టింది. నియోజకవర్గంలో ఎస్టీ సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున ఉండడంతో వారి ఓట్లతో ఓటింగ్ శాతం పెంచుకోవాలని భావించారు. కానీ వాళ్లు ఆశించిన దాంట్లో పావు వంతు ఓట్లు కూడా రాకపోవడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు.
అభివృద్ధి నినాదంపై విశ్వాసం
నాగార్జునసాగర్ అభివృద్ధిపై టీఆర్ఎస్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను ప్రజలు విశ్వసిస్తున్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా నిలిచాయి. 2018లోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగర్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ను గెలిపించారు. సీనియర్ నేత జానారెడ్డిని కాదని నోముల నర్సింహయ్యను గెలిపించి అభివృద్ధికి బాటలు పడేలా జాగ్రత్త పడ్డారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలోపే కరోనా రావడం… ఆ లోపే నర్సింహయ్య హఠన్మరణం పొందడంతో మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కేవలం అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ప్రచారాన్ని నిర్వహించింది. సాగర్ అభివృద్ధే తమ లక్ష్యమంటూ టీఆర్ఎస్ను గెలిపించాలని చేసిన విజ్ఞప్తిని ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పథకాలతో పాటు చేయాల్సిన అబివృద్ధిపైనా హాలియా ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు సాగర్లో ఉన్న సమస్యలకు టీఆర్ఎస్తోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తూ మంచి మెజార్టీతో భగత్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. భగత్ గెలుపు అనంతరం సీఎం కేసీఆర్ స్పందిస్తూ సాగర్కు త్వరలోనే వస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల విశ్వాసాన్ని ప్రకటించిన సాగర్ ప్రజలకు కేసీఆర్ హృదయ పూర్వక ధన్యావాదాలు తెలిపారు.