గుర్రంపోడు, జూన్, 1 : వరుస దొంగతనాలకు పాల్పడుతూ 22 బైకులు, పుస్తెలతాడు చోరీ చేసిన నిందితుడిని గుర్రంపోడు పోలీసుల ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. మండలంలోని మైలాపురం గ్రామానికి చెందిన కట్టా గట్టారెడ్డి కారు డ్రైవర్గా పనిచేస్తూ హైదరాబాద్లోని సంతోషిమాత కాలనీ(హస్తినాపురం)లో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. హైదరాబాద్లోని బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివిన గట్టారెడ్డి చదువుపై ఇష్టం లేక మధ్యలోనే మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. గట్టారెడ్డి 20 ఏండ్ల వయస్సులో కారు డ్రైవింగ్ నేర్చుకొని కొద్దికాలం డ్రైవర్గా పనిచేశాడు. జల్సాలకు, మద్యం తాగేందుకు డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు మొదలుపెట్టి 2017 నుంచి 2019 వరకు ఎల్బీ నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో ఐదు ఇండ్లల్లో బంగారం, సెల్ఫోన్లు, బషీర్బాగ్ ప్రాంతంలోని ఒక ఇంట్లో సెల్ఫోన్ దొంగతనం చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు.
2019లో ఎల్బీ నగర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా, జైలు నుంచి వచ్చిన తర్వాత నాలుగు నెలల క్రితం సోదరుడు విజయవర్ధన్రెడ్డితో గొడవ కావడంతో మండలంలోని పిట్టలగూడేనికి చెందిన తన సోదరి కల్పన ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో జల్సాలకు డబ్బులు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్నాడు. మంగళవారం ఉదయం పిట్టలగూడెం స్టేజీ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానంగా ఉన్న గట్టారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేసిన దొంగతనాల వివరాలు తెలిపాడు. తాను పలు ప్రాంతాల్లో దొంగతనం చేసిన బైక్లన్నీ తన బావ మారెడ్డి రాంరెడ్డి బత్తాయి తోటలో ఉంచానని చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు విషయంలో సమర్థవంతంగా పని చేసిన కొండమల్లేపల్లి సీఐ పందిరి పరశురాం, గుర్రంపోడు ఎస్ఐ రవికుమార్, ప్రొబేషనరీ ఎస్ఐ శశిధర్, పోలీస్ సిబ్బందిని డీఐజీ ఏవీ రంగనాథ్ అభినందించారు.