నీలగిరి, జూన్ 1 : నాణ్యత లేని, కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీఐజీ రంగనాథ్ హెచ్చరించారు. జేడీఏ శ్రీధర్రెడ్డి, ఏఎస్పీ నర్మద, వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి సభ్యులు, విత్తన డీలర్లు, దుకాణాదారులతో జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, వ్యవసాయ సంబంధ విషయాల్లో ప్రభుత్వం పోలీసులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తున్నదన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా విత్తనాల కేసులో ఉన్నట్లుగా గుర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీఎం సైతం రైతుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఎక్కడా పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. నాణ్యమైన, ప్రభుత్వం అనుమతిచ్చిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని డీలర్లకు సూచించారు. వ్యసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నందున రైతాంగం నష్టపోకుండా చూడాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ రూ.767 లకే విక్రయించాలని, అంతకన్నా ఎక్కువ అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కంపెనీ విత్తనాలు, నాణ్యమైనవి మాత్రమే అమ్మాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో ైగ్లెఫోసెట్ మందును అమ్మవద్దని, ఎవరైనా అమ్మితే పీడీ యాక్టుతోపాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. నకిలీ మిర్చి, పత్తి విత్తనాలపై పర్యవేక్షణతోపాటు వాటిని అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయ అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను మండల, జిల్లాస్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గడిచిన ఆరేండ్లలో 19 కేసులు నమోదు చేశామని, అందులో ఆరు పీడీ యాక్టులు ఉండగా, 40వేల నకిలీ విత్తనాల ప్యాకెట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా నుంచి అధికంగా నకిలీ విత్తనాలు వచ్చే క్రమంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద తనిఖీలు పటిష్టంగా అమలు చేస్తామన్నారు. జేడీఏ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాల విషయంలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్రనాయక్, వ్యవసాయాధికారి హుస్సేన్బాబు, విత్తన కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు, దుకాణాదారులు పాల్గొన్నారు.