నల్లగొండ, ఏప్రిల్ 24 : నకిరేకల్ మున్సిపాలిటీతోపాటు నల్లగొండలోని 26వ వార్డుకు జరుగనున్న ఎన్నికలకు నియమావళి ప్రకారం ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ రాహుల్శర్మతోపాటు ఎస్పీ రంగనాథ్ పాల్గొని మాట్లాడారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్ జూనియర్ కళాశాలతో పాటు ఎన్జీ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. అదేవిధంగా కౌంటింగ్ కూడా అక్కడే నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సిబ్బందికి మాస్క్లతో పాటు చేతిగ్లౌస్లు, శానిటైజర్లు అందిస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక మెడికల్ ఆఫీసర్ను ఉంచటం, ఆయా కేంద్రాల్లో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కొవిడ్ బాధితులతోపాటు 80ఏండ్ల వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 27 వరకు ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తామని హైపర్ క్రిటికల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తి ంచి బందోబస్తు ఏర్పాటు, పోలింగ్ ప్రక్రియ రికార్డుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫ్లయింగ్ స్కాడ్, ఎస్ఎస్టీల ద్వారా గట్టి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. రౌడీషీటర్లను ఇప్పటికే బైండోవర్ చేశామని, ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు శరత్చంద్ర, బాలాజీ, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.