నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని డీఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు.
కరోనా ఉధృతి నేపథ్యంలో ఈసీ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూస్తామని అన్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందితో నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది, అధికారులు, మీడియా ప్రతినిధులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు విధిగా కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.
కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్తోపాటు ముఖానికి ఫేస్ షీల్డ్ ధరించాలని చెప్పారు. విజయం సాధించిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం ఇచ్చే సమయంలో వెంట ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
“కౌంటింగ్ ప్రాంతాన్ని, ఈవీఎంలు భద్రపరిచిన బాక్సులను శానిటైజ్ చేసిన తర్వాతే లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు కౌంటింగ్ కేంద్రం వద్దకు రాకుండా పోలీసులకు సహకరించాలి. కౌంటింగ్ కేంద్రం వద్ద కొవిడ్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం” అని డీఐజీ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.