నల్లగొండ: సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యం లో జిల్లాలో నాలుగు రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మంగళవారం హైదరాబా ద్ నుంచి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థల పునఃప్రారంభానికి కావాల్సిన చర్యలు వెంటనే తీసుకుంటామన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్, మినీ గురుకుల, ఆశ్రమ, చెవిటి, మూగ, ఆదర్శ, ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలు మొత్తంగా 2046 పాఠశాలల్లో 2,51,166 మంది విద్యనభ్యసిస్తున్నార న్నారు. ఆయా విద్యాసంస్థల్లో పారిశుధ్య సమస్య లేకుండా చర్యలు తీసుకోవటంతో పాటు తాగునీరు, విద్యుత్ సౌకర్యం లాంటివి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, డీఈవో భిక్షపతి, జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, ఆర్డబ్య్లూఎస్ ఎస్ఈ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.