పెద్దఅడిశర్లపల్లి: ఎన్నో ఏండ్ల సంది ఎండిన చెరువులు.. పేరుకుపోయిన పూడిక, ధ్వంసమైన తూములు, అలుగులతో శిథిలావస్థకు చేరుకుని చుక్క నీరు నిల్వ ఉండలేని దుస్థితి. గత ఐదు సంవత్సరాల్లో మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల మరమ్మతుల వల్ల నేడు మండలం లోని దాదాపు 40 చెరువులు చిన్న కుంటలు నీటితో కళకళలాడుతున్నా యి. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పూడికలో భాగంగా 40 పైగా చిన్న కుంటల్లో పూడిక తీయడం మరియు మట్టి కట్టను బలపరచడంతో పాటు అలుగులు, తూములు ఏర్పాటు చేశారు.
దీంతో మల్లాపురం, ఘనపురం, గుడిపల్లి కుంటలు ఏఎమ్మార్పీ నీటితో నిండగా ప్రస్తుతం కురిసిన వర్షాలకు పీఏపల్లి, అజ్మాపురం, కోదండపురం, సింగరాజుపల్లి, భరత్ పురం, దుగ్యాల, తిరుమలగిరి గ్రామాల పరిధిలోని కుంటలు వర్షపు నీటితో నిండిపోయాయి. మండలంలో నాలుగు విడతల్లో దాదాపు 5 కోట్ల రూపాయాలతో చెరువుల మరమ్మతులు చేపట్టడంతో చెరువుల క్రింద బోర్లు , బావుల్లో భగర్భ జలాలు కూడా పెరిగాయి. దీంతో మిషన్ కాకతీయ మండలలోని చెరువులకు జీవం పోసింది.