సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 4 : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర తరువాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర అయిన లింగమంతులస్వామి కొలువుదీరిన పెద్దగట్టు తిరునాళ్లు షురువైంది. శనివారం జిల్లా కేంద్రంలోని గొల్లబజార్ నుంచి పెద్దగట్టుకు మకర తోరణం తరలింపు వైభవోపేతంగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మకర తోరణానికి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి ఆరంభ భేరీని మోగించి జాతరను ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, పెద్దగట్టు ఆలయ చైర్మన్ కోడి సైదులు యాదవ్, యాదవ సోదరులతో కలిసి మంత్రి జగదీశ్రెడ్డి కాసేపు భేరీ మోగించారు. సంప్రదాయ ఆయుధాలతో నృత్యాలు చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగే అతి పెద్ద జాతరకు సర్వం సిద్ధం చేశామన్నారు. 2014 నుంచి అత్యధిక నిధులు తెచ్చి జాతర వైభవాన్ని పెంచుకున్నామని, ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రెండేండ్లకోసారి జరిగే ప్రతి జాతరకు కావాల్సిన నిధులు సమకూర్చుకుని అన్ని సౌకర్యాలను కల్పించుకుంటూ జాతర వైభవాన్ని మరింత పెంచుకున్నామని చెప్పారు.
లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అన్ని సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవించడంతో పాటు అన్ని మతాల పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తూ ప్రశాంత వాతావరణాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్నదన్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు రూ.15 కోట్లకు పైగా నిధులు కేటాయించి పెద్దగట్టుపై శాశ్వత నిర్మాణాలు చేపట్టామన్నారు. లింగమంతుల స్వామి కొలువై ఉన్న పెద్దగట్టుకు జాతర సందర్భంలోనే కాకుండా నిత్యం భక్తుల తాకిడి ఎక్కువైందని, వారి కోసమే శాశ్వత మంచి నీటి ట్యాంకు, వసతి గృహం, పూజారి నివాసం, కోనేరు, మహిళలకు ప్రత్యేక గదుల నిర్మాణాలు చేపట్టామని చెప్పారు. ఏటేటా పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని గట్టు చుట్టుపక్కల మిషన్ భగీరథ నల్లాలు, శాశ్వత మరుగుదొడ్లతో పాటు అనేక తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి మెడికల్, రెవెన్యూ, పురపాలక శాఖలతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు.
అత్యధిక మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు పెద్ద ఎత్తున సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెద్దగట్టు జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికీ లింగమంతుల స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. జాతరను ప్రశాంత వాతావరణంలో ఐక్యతతో జరుపుకొందామని సూచించారు. జాతరకు దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, పెద్దగట్టు ఆలయ చైర్మన్ కోడి సైదులు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ తాహెర్ పాషా, నాయకులు ఉప్పల ఆనంద్, ఆకుల లవకుశ, పోలెబోయిన నర్సయ్య యాదవ్, జానీ యాదవ్, సవిందర్, శ్రీనివాస్ యాదవ్ |
పాల్గొన్నారు.
నేడు కేసారానికి మంత్రి జగదీశ్రెడ్డి రాక
సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 4 : మండలంలోని కేసారం గ్రామానికి ఆదివారం రాత్రి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రానున్నట్లు గ్రామ సర్పంచ్ మెంతబోయిన నాగయ్య, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు గొర్ల గన్నారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లింగమంతుల స్వామి, చౌడమ్మ దేవతకు మంత్రి పూజలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం దేవతామూర్తులను పెద్దగట్టుకు తరలించనున్నట్లు తెలిపారు.