చిట్యాల: మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల నాణ్యత పెంచి, సాంకేతిక సహకారం తీసుకుంటూ ఈ మార్కెటింగ్ పై దృష్టి పెట్టడం ద్వార సూక్ష్మ స్థాయి నుంచి స్థూల వ్యాపార స్థాయికి ఎదగాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి చరణ్జిత్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాఘ వేంద్ర ప్రతాప్ సింగ్లు పిలుపునిచ్చారు.
ఆదివారం చిట్యాలలోని సామ లక్ష్మీ పాపిరెడ్డి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక గ్రూపుల ప్రత్యేక సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ది కోసం బడ్జెట్ను రూ. 9వేల కోట్ల నుంచి రూ.13వేల 600ల కోట్లకు పెంచిందని, మహిళా సంఘాల రుణ పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచిందని వివరించారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. ప్రతి గ్రామం నుంచి ఒకరు సుశిక్షితురాలైన రిసోర్స్ పర్సన్గా ఎదగాలని అన్నారు. సీఆర్సీ వ్యవస్థ బలోపేతానికి తగిన ప్రణాళికలు తయారు చేస్తు న్నామని, శిక్షణా ప్రణాళికలు తయారు చేసి మహిళల ఆలోచనలకు తగిన సహాకరం అందజేస్తామని తెలిపారు. రైతు ఉత్పత్తి సంఘాల మాదిరిగా చిన్నచిన్న వ్యాపారాల సమూహాలా ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. మహిళా సంఘాల కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బృందం సభ్యులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సన్మానించారు.
స్టాళ్ల సందర్శన
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసిన పౌష్టికహార ఉత్పత్తులు, నిత్యావసర పదార్ధాలు, సబ్బులు, శానిటైజర్లు, గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం స్టాళ్లను వారు పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమీషనర్ వీ.ఎస్.ఎన్.వీ. ప్రసాద్, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్ ప్రవీణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహూల్ శర్మ, డీఆర్డీవో కాళిందిని, డీపీవో విష్ణువర్దన్, ఎంపీడీవో లాజర్, తహశీల్దార్ కృష్ణారెడ్డి, ఏపీఎం పద్మ పాల్గొన్నారు.