నల్లగొండ : వరుస దొంగతనాలకు పాల్పడుతూ దాదాపు 22 బైకులు, ఓ మంగళసూత్రం దొంగతనం చేసిన నిందితుడిని నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దేవరకొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. నిందతుడు కట్టా గట్టారెడ్డి(27) గుర్రంపోడు మండలం మైలాపురం గ్రామానికి చెందిన వ్యక్తి. కారు డ్రైవర్గా పనిచేస్తూ హైదరాబాద్లోని సంతోషిమాత కాలనీ, హస్తీనాపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. జల్సాలకు, తాగడానికి డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాల బాటపట్టినట్లు తెలిపారు.
మంగళవారం ఉదయం గుర్రంపోడు మండల పరిధిలోని పిట్టలగూడెం గ్రామ స్టేజ్ వద్ద ఎస్ఐ రవి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టాడు. ఈ క్రమంలో పోలీసులను చూసి వాహనం ఆపకుండా వేగంగా వెళ్తున్న నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. వాహన కాగితాలు అడగగా లేవని సమాధానం చెప్పాడు. అనుమానాస్పదంగా ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేసిన దొంగతనాల వివరాలన్నీ తెలిపాడని డీఎస్పీ వివరించారు.
దొంగతనం చేసిన బైక్లను విక్రయిద్దామని భావించి పిట్టలగూడెం గ్రామ శివారులోని తన బావ మారెడ్డి రాంరెడ్డి బత్తాయి తోటలో దాచిపెట్టాడని చెప్పారు. నిందితుడి వద్ద నుండి పూర్తి వివరాలు సేకరించడంతో పాటు గట్టా రెడ్డి బావ మారెడ్డి రాంరెడ్డి బత్తాయి తోటలో దాచి ఉంచిన 21 బైకులు, బంగారు పుస్తెల తాడు, సెల్ ఫోన్ సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు. అంతరాష్ట్ర బైకుల దొంగ గట్టా రెడ్డి అరెస్టు విషయంలో సమర్ధవంతంగా పని చేసిన సీఐ పందిరి పరుశురాం, గుర్రంపోడు ఎస్ఐ ఇ.రవి, పీఎస్ఐ శశిధర్, సిబ్బందిని డీఐజీ ఏ.వీ. రంగనాధ్ అభినందించారు.