యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో కృష్ణాష్టమి ముగింపు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మూడో రోజు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. తొలుత బాలాలయంలో లక్ష్మీనారసింహుల ప్రత్యేక అలంకరణతో ఉట్ల సేవోత్సవాన్ని చేపట్టా రు. పాలు, వెన్నతో కూడిన ఉట్టికి పూజలు జరిపారు.
ఉట్టితో ఆలయ నిర్వాహకులు, అర్చకులు, సిబ్బంది, చిన్నారుల తో క్రీడాస్థలికి చేరుకున్నారు. ఉట్టి కొట్టే యత్నంలో ఆటగాళ్లకు ఆటంక పరుస్తూ నీటితో కొడుతూ సంబురాన్ని జరిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్. గీత, ధర్మకర్త నరసింహమూర్తి, ప్రధానార్చకులు మోహనాచార్యులు, మాధవాచార్యులు, ఆలయ ఏఈవోలు గట్టు శ్రవణ్కుమార్, గజవెల్లి రమేశ్బాబు, దోర్బాల భాస్కర్శర్మ, ఆలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రుక్మిణీ కల్యాణం..
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి యాదాద్రీశుడి బాలాలయంలో రుక్మిణీకృష్ణుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ సంప్రదాయ రీతిలో విశ్వక్సేన ఆరాధన, స్వస్తివచన పర్వాలతో కల్యాణోత్సవం తతంగాలను చేపట్టారు. ఆలయ ప్రధానార్చకులు నేతృత్వంలో జరిగిన రుక్మిణీ కల్యాణ విశిష్టతను అర్చకులు వివరించారు. కల్యాణోత్సవ పర్వంతో యాదాద్రిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ముగిశాయని ఆలయ అర్చకులు వెల్లడించారు.