రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ దేవరపెట్టెకు ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు చేసి లక్షలాది మంది భక్తుల నడుమ జాతరను ప్రారంభించారు. కాళ్ల గజ్జెలు, ఢమరుకం, భేరీల చప్పుళ్లు.. త్రిశూలాలు, బరిశెలు, కత్తుల విన్యాసాలు.. యాదవుల సంప్రదాయ నృత్యాలతోపాటు ఒలింగా.. ఓ లింగా స్మరణలతో దురాజ్పల్లి దద్దరిల్లుతున్నది.
సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం జీపులు, కార్లు, ట్రాక్టర్లు, లారీల్లో బయల్దేరి దారులన్నీ పెద్దగట్టుకే అన్నట్లు తండోపతండాలుగా తరలివచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరను పురస్కరించుకొని గట్టు పరిసరాలు దుకాణాలతో నిండిపోయాయి. ఎగ్జిబిషన్లు, జెయింట్ వీల్స్, బ్రేక్డ్యాన్స్ తదితరాలు జాతరకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భక్తుల రద్దీతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-సూర్యాపేట, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ)