నల్లగొండ : కరోనా విపత్కర సమయంలో డాక్టర్లు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని, అదే సమయంలో స్కానింగ్ సెంటర్లు, దవాఖానల యాజమాన్యాలు మానవతావాదంతో కొవిడ్ రోగులకు సేవలందించాలని డీఐజీ ఏవీ రంగనాథ్ కోరారు. అత్యధిక చార్జీలు వసూలు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీలను మాత్రమే తీసుకోవాలని సూచించారు. జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన పలు దవాఖానలపై దేవరకొండలో ఆక్సిజన్ సరఫరాకు అధిక చార్జీ వసూలు చేస్తున్న విగ్రహాల ఆనంద్పై కేసు నమోదు చేశామని చెప్పారు. మిర్యాలగూడలోని శ్రీసాయి సూర్య దవాఖానలో 36డోసుల రెమిడిసివర్ ఇంజక్షన్లను సీజ్ చేశామని తెలిపారు.
కొవిడ్ చికిత్స, ఇతర అంశాలకు తీసుకోవాల్సిన చార్జీలపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.అందుకు అనుగుణంగా దవాఖాన యాజమాన్యాలు చార్జీలు వసూలు చేయాలి. సాధారణ వార్డు, ఐసోలేషన్, నిర్దేశించిన పరీక్షలకు రూ. 4 వేలు, ఐసీయూతో ఐసోలేషన్, ఈసీజీ ఎక్స్ రే, మందులు ప్యాకేజీకి రూ. 7,500, వెంటిలేటర్తో కూడిన ఐసీయూ చికిత్స, రోగికి భోజనం, నిర్దేశించిన వైద్య పరీక్షలకు రూ. 9 వేలు చార్జీ చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా RT-PCR పరీక్ష దవాఖానలో చేస్తే రూ. 2,200, బాధితుడి ఇంటి వెళ్లి శాంపిల్స్ సేకరిస్తే రూ.2,800 వసూలు చేయాలని సూచించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయాలని చెప్పారు.
కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీలు, అందులో ఏ చికిత్సలు చేస్తారనే అంశం, ఏ ప్యాకేజీకి ఎంత చార్జీ చేస్తున్నారనే విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రతి దవాఖానలో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. చార్జీల వివరాలను వెల్లడించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని డీఐజీ రంగనాథ్ హెచ్చరించారు. ఆసుపత్రుల్లో చార్జీల పట్టిక ఏర్పాటు, రోగుల నుంచి వసూలు చేస్తున్న చార్జీలు, దవాఖానలో అందుబాటు ఉన్న బెడ్స్ వివరాలు అన్నింటిపై టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ చేస్తామని ఆయన తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లోని కొవిడ్ రోగులకు అవసరమైన మందులు, రెమిడిసివర్ ఇంజెక్షన్, ఆక్సిజన్ లభ్యత గురించి నిరంతర నిఘా ఏర్పాటు చేసి రోగులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందించేందుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన వద్ద కొవిడ్ సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగుల ఆరోగ్య పరిస్థితి, అత్యవసర చికిత్స అందించేందుకు ఇతర దవాఖానలకు తరలించేలా ఎస్ఐ స్థాయి అధికారి నేతృత్వంలో సహాయ కేంద్రం 24 గంటలు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వైద్యులు, దవాఖాన, స్కానింగ్ సెంటర్ల యజమాన్యాలు ప్రజలకు సహకరించాలని డీఐజీ రంగనాథ్ కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.