మర్రిగూడ, ఫిబ్రవరి 4 : దేవుడి భూములను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. మండల కేంద్రంలోని భవానీరామలింగేశ్వర స్వామి ఆలయానికి సర్వేనంబర్ 6లో 1.19 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూముల్లో బ్లాస్టింగ్లు చేయడంతో పాటు భూమిని కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్లు ఉండడమే కాకుండా వట్టిపల్లికి వెళ్లే బీటీ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. దాంతో గజం భూమి విలువ రూ.8 నుం చి రూ.10 వేల వరకు పలుకుతున్నది. ఈ నేపథ్యంలో ఆ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. గుట్ట రాళ్లను పగులగొట్టి మరీ కబ్జాకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
2020లో గుట్ట రాళ్లు బ్లాస్టింగ్..
ఆలయానికి అనుకొని ఉన్న గుట్ట రాళ్లను 20 20లో గుర్తు తెలియని వ్యక్తులు బ్లాస్టింగ్ చేయించారు. మర్రిగూడలోని కబ్జా భూములపై అప్పట్లో నమస్తే తెలంగాణ మినీలో-మర్రిగూడలో ‘ప్రభు త్వ భూములు మాయం’-శీర్షికతో కథనం ప్రచురించింది. దాంతో అధికారులు ప్రభుత్వ భూములపై ఆరా తీశారు. మొదటగా సర్వే నంబర్ 6లోని దేవుడి భూములకు హద్దులను గుర్తించారు. కంచెను ఏర్పాటు చేసుకోవాలని గ్రామపంచాయతీ అధికారులకు సూచించారని సమాచారం. హద్దులు నిర్ణయించాక కూడా హద్దు రాళ్లను తొలగించి దేవుడికి చెందిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు మరోసారి సర్వే చేసి దేవుని భూములను కాపాడాలని, గుట్టరాళ్లను పగులగొట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కబ్జా చేస్తే చర్యలు తప్పవు
మండలకేంద్రంలో సర్వే నంబర్ 6లో 1.19 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డుల్లో ఉంది. అనుమతి లేకుండా ప్రభుత్వ భూముల్లో ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడినా రెవెన్యూ చట్టం ప్రకారం చర్యలు తప్పవు. భూములకు సంబంధించిన క్షేత్రస్థాయిలో మా సిబ్బంది ద్వారా సేకరిస్తా. విచారణ అనంతరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసు కుంటాం.
-శ్రీనివాస్రెడ్డి, తాసీల్దార్