నల్లగొండ : నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మధ్యే పోటీ నెలకొంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి జానారెడ్డిపై నోముల నర్సింహయ్య 7,700 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. గుర్రంపోడు, తిరుమలగిరిసాగర్, పెద్దవూర, నిడమనూరు, మాడ్గులపల్లి, త్రిపురారం, అనుముల.
మొత్తం 2,19,745 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,10,838 మంది మహిళా ఓటర్లు. ఏర్పాటు చేసిన 346 పోలింగ్ కేంద్రాల్లో 108 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. పోలింగ్ సజావుగా కొనసాగేందుకు 5 వేల మంది పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందికి విధులు కేటాయించారు. పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు.
దివ్యాంగులకు, వృద్ధులకు, కొవిడ్-19 రోగులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 8 వేల పోస్టల్ బ్యాలెట్లను జారీ చేశారు. కొవిడ్ రోగులు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.