తిరుమలగిరి, జూలై 14:రైతులు ఎక్కువగా వరి సాగు చేయడంతో దానికి డిమాండ్ పడిపోయింది. పైగా నీటి వినియోగంతోపాటు కూలీలు, ఇతర ఖర్చులు అధికంగా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం గ్రామానికి చెందిన రైతు దూలం వెంకటేశ్వర్లు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాడు. అందరికంటే భిన్నంగా కూరగాయలు సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు.
వెంకటేశ్వర్లుకు గ్రామంలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండేండ్ల క్రితం వరకు అందులో బోర్ల ద్వారా వరి పండించాడు. ఆశించిన దిగుబడి. లాభం లేకపోవడంతో పంట మార్పిడి చేయాలనుకున్నాడు. తీగజాతి కూరగాయల సాగుకు రాతికడీలు నాటించాడు. వీటితోపాటు మల్చింగ్ పద్ధతిలో సాగు చేసే ఏర్పాటు చేశాడు. ఇందులో దోస, కాకర, బెండ, బీర, చిక్కుడు, సోర కాయలు వేశాడు. డ్రిప్ విధానంతో నీరు అందిస్తున్నాడు. ఎకరం వరికి సరిపోయే నీటిని నాలుగు ఎకరాలకు అందిస్తున్నాడు.
45 రోజుల్లో పంట చేతికి..
రెండేండ్లుగా కూరగాయలను ఇలాగే కూరగాయలు పండిస్తుండగా గత యాసంగిలో రెండు ఎకరాల్లో దోస, ఎకరంలో బెండ, ఎకరంలో కాకర, ఎకరంలో బీర, ఎకరంలో చిక్కుడు, సోరకాయ సాగు చేశాడు. 45 రోజుల్లో పంట చేతికి వచ్చింది. రోజు తప్పించి రోజు కూరగాయలు తెంచి స్థానిక దుకాణాల్లో విక్రయించాడు.
ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి..
ఎకరంలో పందిరి వేసేందుకు తొలుత రూ.3 లక్షలు (రాతికడీలు, కూలీల ఖర్చు ఇతర వాటికి) ఖర్చు అయ్యింది. ఎకరం విత్తనాలకు రూ.10వేలు, దున్నడానికి రూ.5వేలు, మల్చింగ్కు రూ.10వేలు, కూలీలకు రోజు రూ.వెయ్యి చొప్పున ఇచ్చాడు. ఎకరాకు మొత్తం పెట్టుబడి సుమారు రూ.లక్ష వచ్చింది.
రూ.50వేల ఆదాయం
రెండు రోజులకు ఒకసారి రెండు క్వింటాళ్లకు పైగా బీర, ఐదు క్వింటాళ్ల దోస, రెండు క్వింటాళ్ల బెండ, క్వింటాల్ కాకర, క్వింటాల్ సోరకాయ దిగుబడి వచ్చింది. ఇలా నెలరోజులపాటు వచ్చింది. పెట్టుబడి పోగా ఎకరాకు రూ.50 వేలు మిగిలింది. ఆరు ఎకరాలకు కారుకు రూ.3 లక్షల ఆదాయం వచ్చింది. ఏడాదికి వానకాలం, యాసంగి కలిపి రూ.6లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ వానకాలంలో కూడా వివిధ రకాల కూరగాయలు వేసేందుకు సాగు చేస్తున్నాడు. మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంతేకాకుండా 20 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.