నిండిన శ్రీశైలం ప్రాజెక్టు..
రెండు గేట్ల ద్వారా నీటి విడుదల
వరద నీరంతా సాగర్కే..
క్రస్ట్ గేట్లకు చేరువలో నీటిమట్టం
రూ.70 లక్షలతో క్రస్ట్ గేట్లకు మరమ్మతులు
రెండు పంటలకు నీరు పుష్కలం
నందికొండ, జూలై 28: శ్రీశైలం క్రస్ట్గేట్ల మీదుగా దుంకుతున్న కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు దూసుకొస్తున్నది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల పూర్తిస్థాయిలో నిండడంతో శ్రీశైలానికి 4.6లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తుతున్నది. క్రస్ట్గేట్లు, విద్యుత్ ఉత్పాదన ద్వారా నాగార్జునసాగర్కు 1,18,167 కూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో క్రమంగా పెరిగే అవకాశం ఉన్నది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను బుధవారం రాత్రి 9గంటలకు 542.10అడుగుల(191.881 టీఎంసీల)కు చేరింది. నేడు క్రస్ట్గేట్ల లెవల్(545అడుగులు)కు నీరు చేరనున్నదని అధికారులు వెల్లడించారు. ఎస్ఎల్బీసీ ద్వారా 1000క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జూలైలోనే వరద నాగార్జునసాగర్కు చేరడంతో ఈ సీజన్లోనూ క్రస్ట్గేట్లను ఎత్తే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2009 సంవత్సరంలో సుమారు నెల రోజులపాటు 473 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయగా, ఆ తర్వాత 2014వరకు క్రస్ట్గేట్లు తెరుచుకోలేదు. తిరిగి 2014లో 21టీఎంసీలు విడుదలయ్యాయి. డ్యాం చరిత్రలో 2019 సంవత్సరంలో సుమారు 4నెలల పాటు 26 క్రస్ట్ గేట్ల ద్వారా 698టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. మళ్లీ 2020లో కుడి, ఎడమ కాల్వలు, జల విద్యుత్ కేంద్రం, క్రస్ట్ గేట్ల ద్వారా 1399టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఆగస్టు 2న క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారులు అక్టోబర్ 3వరకు నీటి విడుదల కొనసాగించారు.
70లక్షలతో క్రస్ట్ గేట్ల మరమ్మతులు…
ప్రాజెక్టు 26గేట్లలో గతంలో 4గేట్లకు మరమ్మతు చేయగా మిగిలిన 22గేట్లకు రూ.70లక్షల వ్యయంతో ఇటీవల మరమ్మతు చేపట్టారు. స్వప్న కంపెనీకి 10గేట్లు, డేకామ్ కంపెనీకి మరో 12గేట్లను అప్పగించగా రబ్బరింగ్, గ్రీసింగ్, గేర్ అయిల్ మార్పిడి పనులను పూర్తి చేసి ట్రయల్ సక్సెస్ చేశారు.
రెండు పంటలకు నీరు..
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో ఈ ఏడాది సైతం రెండు పంటలకు నీరందే అవకాశాలున్నాయి. శ్రీశైలం జలాశయం గేట్లు తెరుచుకోవడంతో పాటు ఇన్ఫ్లో ఆశాజనకంగా కొనసాగుతున్నది. అక్టోబర్ నాటికి వరద కొనసాగే అవకాశం ఉండడంతో జలాశయం పూర్తిస్థాయిలో నిండి క్రస్ట్గేట్లు కూడా ఎత్తనున్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టులో ఆశలు చిగురిస్తున్నాయి. రెండు పంటలకు ఢోకా ఉండబోదని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. గతేడాది ఆగస్టు 7న ఎడమ కాల్వ ఆయకట్టుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగు నీటిని విడుదల చేశారు.
సర్వం సిద్ధంగా…
కృష్ణానది ఎగువన అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా ఇన్ఫ్లో వచ్చే అవకాశాలున్నాయి. డ్యాంసేఫ్టీ రివ్యూ ప్యానల్ కమిటీ సూచనల ప్రకారం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశాం. క్రస్ట్ గేట్ల రబ్బర్ సీలింగ్ మార్పిడి, గేట్లకు అమర్చిన మోటర్ల వరాయిలింగ్, రోప్వైర్ల మరమ్మతు, నిర్వహణ పనులను పూర్తి చేశాం. రూ.50లక్షల వ్యయంతో కుడికాల్వ 9వ తూముకు కొత్త గేటు ఏర్పాటు చేశాం. డ్యాం పైన లెఫ్ట్ టవర్ కంట్రోల్రూంలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ఆపరేటింగ్తో వరదల సమయంలో ఏర్పడే విపత్కర పరిస్థితులను సులువుగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం డ్యాం భద్రతకు ఎటువంటి ఢోకా లేదు. వరదలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సారి కూడా 26క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నీటి విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి మంచి ఫలితాలు అందిస్తున్నది.