హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): శాంతి, భద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పోలీసులు మరో గొప్ప ముందడుగు వేశారు. మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, నేర పరిశోధన కోసం దేశంలోనే తొలిసారి ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని రాష్ట్ర మహిళా భద్రతా విభాగ కార్యాలయంలోని మూడో అంతస్థులో సిద్ధమవుతున్న ఈ ల్యాబ్ నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నది. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులకు మరింత భద్రత కల్పించేందుకు ఆర్అండ్డీ సెంటర్లా ఈ ల్యాబ్ పనిచేస్తుందని మహిళా భద్రతా విభాగ డీఐజీ సుమతి తెలిపారు. దేశంలో డిజిటల్ నేరాల దర్యాప్తునకు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ఎండీ)తో కలిసి పనిచేసే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటిలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ (సీఆర్సీఐడీఎఫ్) సహకారంతో ఈ ల్యాబ్ పనిచేయనున్నది. ఇందుకోసం సీఆర్సీఐడీఎఫ్తో తెలంగాణ మహిళా భద్రతా విభాగం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. సైబర్ నేరాల పరిశోధనకు సంబంధించిన అత్యాధునిక టూల్స్, ఇతర సాంకేతిక అంశాలపై ఈ సంస్థ సహకారం అందించనున్నది. ఇందుకోసం ఒక ఎస్సైని, ఆరుగురు కానిస్టేబుల్స్ను ప్రత్యేకంగా నియమించారు. వీరితోపాటు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, సైబర్ క్రైం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్, కంటెంట్ రైటర్ లాంటి నిపుణులను నియమించేందుకు ఇప్పటికే రెండు దఫాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు పోలీసులు ఎలాంటి సాంకేతికతను అందిపుచ్చుకోవాలి? ఏవిధమైన మెళకువలను అలవర్చుకోవాలి? అనే అంశాలను ఈ సైబర్ ల్యాబ్ ద్వారా నేర్పనున్నారు. ఆన్లైన్ ద్వారా మహిళలు, చిన్నారులను ట్రాఫికింగ్ చేసే ముఠాలు, చిన్నారులను నేరాల్లోకి దింపేందుకు యత్నించే ముఠాలు, పోర్నోగ్రఫీ వెబ్సైట్లపై డేగకన్ను వేసి అసాంఘిక శక్తుల ఆకట్టించేందుకు అవసరమైన సరికొత్త టూల్స్ను సైబర్ ల్యాబ్ అందిస్తుంది. షీటీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, సైబర్ క్రైం దర్యాప్తు బృందాలకు ఈ ల్యాబ్లో నిరంతర శిక్షణ ఇస్తారు. క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులకు, సైబర్ ఇంటెలిజెన్స్ సిబ్బందికి వర్క్షాప్లు నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో నమోదవుతున్న కేసుల ఆధారంగా కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్తోపాటు మహిళలు, చిన్నారుల భద్రతపై విజన్ డాక్యుమెంట్ను ఈ సైబర్ ల్యాబ్ రూపొందిస్తుంది.