కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రభుత్వ రాబడి గణనీయంగా తగ్గింది. అయినా కష్టకాలంలో కూడా నగరంలో విశేష అభివృద్ధి జరిగింది. మౌలిక సమస్యలు చాలావరకు తీరేలా బల్దియా సమన్వయంతో పనిచేసింది. ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా తీర్చే ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, ఆర్వోబీ, ఆర్యూబీలు అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా సులభతరమైంది. ధగధగలాడే రోడ్లతోపాటు లింకు రోడ్లు నిర్మించి దూర ప్రాంతాలను దగ్గర చేసింది.
మణిహారంలాంటి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, థీమ్ పార్కుల నిర్మాణం, నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్, చెత్త రవాణాకు ఆధునిక వాహనాలను సమకూర్చడంతోపాటు నాలాల అభివృద్ధికి ఎస్ఎన్డీపీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఔటర్ చుట్టూ గణనీయ అభివృద్ధి జరగడమే కాకుండా ఇంటర్చేంజ్ల వద్ద ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి 110 మందికి పునర్జన్మ ఇచ్చారు. మెట్రో రవాణాలో సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం మున్సిపల్ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇందులో నగరాభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మౌలిక వసతుల కల్పనకు విశేషంగా కృషి చేసింది. నగరవాసుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ యంత్రాంగం పనిచేసింది. రహదారుల నిర్మాణం, ఎస్ఆర్డీపీ, లింక్ రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులను దశల వారీగా అందుబాటులోకి తెచ్చి ప్రజా రవాణాను మెరుగుపర్చింది. ట్రాఫిక్ రహిత నగరమే లక్ష్యంగా పనులను వేగవంతం చేయడం, నగరానికే నగిషీగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, థీమ్ పార్కుల నిర్మాణం, నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ , బల్దియా ఆస్తుల పరిరక్షణకు చర్యలు, మున్సిపల్ వ్యర్థాల రవాణాకు ఆధునిక వాహనాలను అధికారులు సమకూర్చారు. నాలాల అభివృద్ధితో పాటు మరెన్నో వినూత్న సంస్కరణల ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. శుక్రవారం ప్రగతి భవన్లో 2020-21 మున్సిపల్ శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
వందేండ్ల తర్వాత గతేడాది అక్టోబర్ 2020లో కురిసిన వర్షంతో నగరం అతలాకుతలం అయ్యింది. దాదాపు 10 లక్షల కుటుంబాలపై ప్రభావం చూపి భారీ నష్టం కలిగించింది. దీంతో నాలాల నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎస్ఎన్డీపీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. మొదటి దశలో రూ.858 కోట్లను మంజూరు చేసి వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం చూపే పనిలో పడింది.
కరోనా నియంత్రణకు జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపట్టింది. కొవిడ్ రక్షణ కేంద్రాలు, అత్యవసర కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి అంటువ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. 040-2111 1111 నంబర్తో కాల్సెంటర్ ఏర్పాటు చేసి 18 మంది డాక్టర్లు, 22 మంది ఆపరేటర్లతో మూడు షిప్టుల్లో నిరంతరాయంగా 11 వేల మందికి సేవలు అందించింది. అంతేకాక ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సిబ్బంది ఫీవర్ సర్వే చేపట్టారు.
ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం, సమయం, ఇంధనం ఆదా లక్ష్యంగా లింక్ రోడ్లను చేపట్టారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో రూ.313.65 కోట్లతో 22 చోట్ల లింకు రోడ్లను చేపట్టారు. ప్రస్తుతం 16 గ్రీన్ ఫీల్డ్ లింకు రోడ్లు పూర్తి చేశారు. 2020-21 సంవత్సరంలో 13.56 కి.మీ దూరం కవర్ చేస్తూ రూ.153.93 కోట్ల వ్యయంతో చేపట్టిన 16 లింక్ రోడ్ల పనులను ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
సీఆర్ఎంపీలో భాగంగా జీహెచ్ఎంసీ 709.49 కి.మీలలోని 401 మార్గాలు, ప్రధానమైన రోడ్ల పనులు చేపట్టింది. మొదటి దశలో 383.44 కి.మీ పొడవు రోడ్డు, పుట్పాత్ల నిర్వహణ, సెంట్రల్ మీడియన్, పచ్చదనం , రీ కార్పొరేట్ పనులకు రూ. 457కోట్లు ఖర్చు చేసింది.
రూ.1100.03 కోట్ల వ్యయంతో 4476 రోడ్డు పనులు చేపట్టగా ఇందులో రూ.577.31 కోట్ల వ్యయంతో 2552 పనులను పూర్తి చేశారు. పారిశుధ్యం, అంటువ్యాధుల నిర్మూలనలో భాగంగా 202 మంది అదనపు సిబ్బందితో 161 టన్నుల సోడియం హైపోక్లోరైట్ (నాల్కో)ను అన్ని జోన్లలో పిచికారీ చేయించారు. ముఖ్యంగా కంటైయిన్మెంట్ జోన్లలో రోజూ రెండు సార్లు స్ప్రే చేపట్టారు. ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నారు. ఓపీడీ , టెలీకన్సల్టేషన్, బస్తీ ల్యాబ్ రోగ పరీక్షలు, రోగ నిరోధక సేవలు, ప్రసవానికి ముందు తర్వాత మహిళల సంరక్షణ, కుటుంబ నియంత్రణ, అనిమియాకి స్క్రీనింగ్, బీపీ, బ్లడ్షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టారు. కొవిడ్ సమయంలో ఈ సేవలు నిర్విరామంగా కొనసాగాయి.
హైరైజ్ టవర్లు.. స్కై వాక్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశలో 69 కి.మీ దూరాన్ని రూ.21,000 కోట్లతో విజయవంతంగా పూర్తి చేశారు. 2017 నుంచి దశల వారీగా ప్రారంభమైన మెట్రో సేవల ద్వారా 2021 నాటికి 18.34 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. మొబైల్ యాప్ల ద్వారా మెట్రో టికెట్లను పొందేలా ఏర్పాట్లు చేశారు. కరోనా సమయంలో కౌంటర్ల వద్ద క్యూలో నిల్చోకుండా క్యూర్ఆర్ కోడ్ ఆధారిత టికెటింగ్ సౌకర్యం కల్పన
మూసీ అభివృద్ధిలో భాగంగా నగరానికి పడమర దిక్కున ఉన్న గండిపేట నుంచి తూర్పు దిక్కు ఉన్న గౌరెల్లి వరకు 55 కి.మీ పొడవునా మూసీ హద్దులు, బఫర్ జోన్లను నిర్ణయించేందుకు డీజీపీఎస్ సర్వేను అధికారులు నిర్వహించారు. రూ.4.59 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కొత్తగా మూసీపై 14 వంతెనలను, ఒక నూతన లింక్ రోడ్డును రూ.392.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. వీటిని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నిధులతో నిర్మించనున్నారు.