అంబర్పేట, జూలై 9: కరోనా సమయం పోలీసులకు కొత్త అనుభవం నేర్పిందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని, అయినా పోలీసులు విజయవంతంగా విధులు నిర్వర్తించారని అభిప్రాయపడ్డారు. కాన్ఫెడేరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రి (సీఐఐ), యంగ్ ఇండియన్స్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, వీఎస్టీ ఇండస్ట్రిస్ లిమిటెడ్ సహకారంతో అంబర్పేట సీపీఎల్ గ్రౌండ్స్లో పది పడకల పోలీసు దవాఖానను ఏర్పాటు చేశారు. నగర అడిషనల్ కమిషనర్ (క్రైమ్స్), సిట్ షికా గోయల్, సీఐఐ చైర్మన్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ సమీర్ గోయల్, వీఎస్టీ ఎండీ ఆదిత్య దేబు గుప్తా, అభిషేక్ సల్తానియాతో కలిసి నగర సీపీ అంజనీకుమార్ పోలీసు దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న దవాఖానకు అనుసంధానంగా (ఎక్స్టెన్షన్) అత్యాధునిక వసతులతో కొత్త దవాఖానను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీసు సిబ్బంది, కుటుంబాల కోసం వైద్యపరంగా సేవలందించేందుకు ఈ పది పడకల దవాఖానను ఏర్పాటు చేశామని తెలిపారు.
కరోనా సమయంలో పోలీసులు, అధికారులు గాంధీ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో కూడా విధులు నిర్వహించారంటూ డీసీపీ కల్మేశ్వర్ను అభినందించాలన్నారు. ఐదు వేలకు పైగా పోలీసులు కరోనా బారినపడ్డారని తెలిపారు. ఎలాంటి భయాందోళన లేకుండా ప్రజలకు సేవ చేశారని, ఇది పోలీసులకు ఒక కొత్త అనుభవమన్నారు. అడిషనల్ సీపీ షికా గోయల్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసిన దవాఖానలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. అన్ని వసతులతో కూడిన మెడికల్ ల్యాబ్ కూడా ఉందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రమేశ్రెడ్డి, శ్రీనివాస్, విశ్వప్రసాద్, అవినాశ్ మహంతి, కల్మేశ్వర్, పోలీసు మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.