హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ లాభాల బాటలో పయనిస్తున్నది. ఈ సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.663.32 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ త్రైమాసికంలో బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.6,337 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇది గతేడాది తొలి త్రైమాసికంతో పోల్చితే 78 శాతం అధికం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.5,393 కోట్ల బొగ్గు అమ్మకాలు జరిపింది. గతేడాది ఇదే సమయంలో బొగ్గు అమ్మకాల కంటే ఇది 89.16 శాతం ఎక్కువ. తద్వారా సుమారు రూ. 394.89 కోట్ల లాభాలను ఆర్జించింది. కరోనా ప్రతికూలతల్లోనూ నిబంధనలు పాటిస్తూ, ఉత్పత్తిని పెంచిన కార్మికులు, ఉద్యోగులను సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగించి, నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు.