సిద్దిపేట అర్బన్, జూలై 3 : తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన గ్రామం చల్లగా ఉండాలని, అన్నింటా ఆదర్శంగా ఉండాలని సీఎం కేసీఆర్ కోరుకున్నారని, అందుకే ఇలాంటి బృహత్తర కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభించుకున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక అనుబంధ గ్రామం దమ్మచెరువులో 56, మాచాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హరీశ్నగర్లో 30 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులతో సామూహిక గృహా ప్రవేశాలు చేయించారు. అంతకు ముందు చింతమడక గ్రామంలో నిర్మించిన రైతు వేదికను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటిసారి పాత ఇండ్ల కూల్చివేతలు ఇక్కడి నుంచి ప్రారంభమై మొదటిసారి గృహ ప్రవేశాలు చేసుకుంటున్నామన్నారు. ఇది ఐక్యతకు నిదర్శనమని, ఈ గ్రామస్తులందరు ఒకే మాట ఒకే బాటగా నడుస్తున్నారని అన్నారు. సామూహిక గృహా ప్రవేశాలు జరిగి, ఇక్కడి ప్రజలంతా ఎంత సంతోషంగా ఉన్నారో.. అదే సంతోషంతో సీఎం కేసీఆర్ ఉంటారన్నారు.
చింతమడక, దమ్మచెరువుకు కాళేశ్వరం నీళ్లు రావడంతో పాటు ఇవాళ్ల పండగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేశామని తెలిపారు. చింతమడకతో ప్రారంభమైన బృహత్తర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. దమ్మచెరువులో కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు చూస్తే కడుపు నిండినంత సంతోషంగా ఉందన్నారు. ఆయా గ్రామాల్లో మిగిలిన పనుల పూర్తి, మరింత మంది లబ్ధిదారులకు ఫలాలు అందేందుకు నిధులు విషయమై వారంలో పరిష్కారం చూపుతామని మంత్రి భరోసా కల్పించారు.60 ఏండ్లు నిండిన వృద్ధులకు ఎలాంటి సాయం అందించాలన్న అంశంపై సీఎం కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దమ్మచెరువు వద్ద మినీ ఫంక్షన్హాల్, బడి, అంగన్వాడీ, బస్షెల్టర్, నర్లేండగడ్డ రోడ్డును త్వరలోనే వేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంకా మిగిలిపోయిన పాత ఇండ్లు కూల్చని వారిపై, మొండికేసిన వారిని సముదాయించి త్వరతగతిన పూర్తి చేయించాలని సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డికి మంత్రి ఆదేశించారు.
బతుకుదెరువు కోసం వెళ్లిన వారి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సీఎం కేసీఆర్ పేరు నిలబెట్టేలా.. మీ ఇండ్లు, మీ కాలనీ, మీ గ్రామాన్ని నిలుపుకోవాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కోరేది.. పుట్టిన ఊరు సల్లగా ఉండాలి.. ఆదర్శంగా ఉండాలనే కోరుకుంటున్నట్లు, తనకు ఈ స్థాయికి తెచ్చిన ఊరు కాబట్టి మొదటగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి చేపట్టామన్నారు. దశల వారీగా రాష్ట్రమంతా విస్తరించజేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని.. రాజకీయంగా కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, ఎంపీపీ శ్రీదేవి చందర్రావు, సర్పంచ్లు హంసకేతన్రెడ్డి, పంజా భాగ్యలక్ష్మీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.