వరద ముంపు తొలగించేలా డ్రైనేజీల నిర్మాణం
మేయర్ వై.సునీల్రావు
కార్పొరేషన్, జూన్ 22 : నగరంలో ప్రధాన మురుగు కాలువల సమస్యలు పరిష్కరిస్తామని నగర మేయర్ వై సునీల్రావు తెలిపారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో మేయర్ వై.సునీల్రావు పర్యటించారు. 60వ డివిజన్లో మురుగుకాల్వను పరిశీలించారు. అలాగే 24వ డివిజన్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో వరద వచ్చినప్పుడల్లా జ్యోతినగర్ ప్రాంతంలోకి తీవ్రంగా వరద వస్తుందన్నారు. డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నగరంలో డ్రైనేజీ నిర్మాణల్లో సరియైన లెవల్స్ పాటించే విధంగా చూడాలన్నారు. ఎక్కడా ఇబ్బంది కలుగకుండా ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు వాల రమణరావు, కుర్ర తిరుపతి, స్థానిక నాయకులు, నగరపాలక అధికారులు పాల్గొన్నారు.
పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతాం
నగరంలోని పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 9వ డివిజన్లో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. అలకాపురిలోని పార్కును త్వరలోనే మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపా రు. అలకాపురిలోని డ్రైనేజీ సమస్యకు త్వరలోనే పూర్తి పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. ఇక్కడి శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.