అమృత్సర్: వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీచేస్తుందని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. ఆప్ తరఫున పంజాబ్ సీఎం అభ్యర్థిగా సిక్కు మతానికి చెందిన వ్యక్తినే ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. ఎవరిని చూసైతే యావత్ పంజాబ్ ప్రజలు గర్వంగా ఫీలవుతారో అతనే తమ పార్టీ సీఎం అభ్యర్థి కాబోతున్నారని వ్యాఖ్యానించారు.
అయితే పంజాబీలందరూ గౌరవించే ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని మాత్రం కేజ్రివాల్ వెల్లడించలేదు. ఇవాళ పంజాబ్లోని అమృత్సర్ సిటీలో జరిగిన పార్టీ సమావేశంలో ఆరవింద్ కేజ్రివాల్ మాట్లాడారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బర్గారీ శాక్రిలేజ్ కేసులో దోషులకు శిక్షపడేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేజ్రివాల్ మాజీ ఐజీ కున్వర్ విజయ్ ప్రతాప్కు ఆప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానంచారు.