కరోనా కేసులు తగ్గిపోతున్నా కూడా ఎందుకో కానీ మరణాలు మాత్రం ఇంకా ఆగడం లేదు. ఇప్పటికీ అక్కడో ఇక్కడో ఎక్కడో ఓ చోట ప్రముఖులు కన్నుమూస్తూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటి కవిత ఇంట్లో తీరని విషాదం నింపింది కరోనా. ఆమె కొడుకు ఇప్పటికే మరణించగా.. భర్త పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఇది మరిచిపోకముందే మరో నటుడు, సినిమాటోగ్రాఫర్ కూడా కరోనాకు బలైపోయాడు. అతడే షమన్ మిత్రు.. అతడి వయసు కేవలం 43 ఏళ్ళు మాత్రమే.
జూన్ 17 ఉదయం చెన్నైలో ఈయన కన్నుమూశారు. కోవిడ్ మహమ్మారి సంబంధిత సమస్యలతో బాధపడుతూనే ఈయన తనువు చాలించారు. ఈయన సినిమాటోగ్రఫర్ గా కొన్నిసినిమాలకు పని చేసారు. అలాగే కొన్ని సినిమాల్లో నటించారు కూడా.2019లో తోరతి చిత్రంలో ఆయన గొర్రెల కాపరి పాత్రలో నటించారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పట్లో తోరతి సినిమా గురించి మిత్రు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
ఈ సినిమా గొర్రెల కాపరుల జీవితాలను ప్రతిబింబిస్తుంది.. కాపరి పాత్రలో నటించాలంటే.. నటులు ఆ జీవనశైలికి తగ్గట్టుగా.. బరువు తగ్గాలని తెలిపాడు. అంతేకాదు గొర్రెల వెంట కొన్ని మైళ్ల దూరం చెప్పుల్లేకుండా నడవాలి.. ఎండ వేడినైనా తట్టుకోవాలి.. ఇవన్నీ చేయడానికి చాలామంది నటులు ఇప్టపడరు.. కానీ నేను ఈ పాత్ర ఎంతో ఇష్టంగా చేసానంటూ చెప్పుకొచ్చాడు. షమన్ మిత్రుకి భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. ఈయన మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతికి సంతాపం తెలిపారు.