ముంబై: బ్లాక్ ఫంగస్ సోకిన ముగ్గురు పిల్లల కండ్లను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. కరోనా నుంచి కోలుకున్న 4, 6, 14 ఏండ్ల వయసున్న ముగ్గురు పిల్లలకు ముకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) సోకింది. దీంతో ముంబైకి చెందిన కేబీహచ్ బచూలి ఆప్తాల్మిక్, ఈఎన్టీ హాస్పిటల్లో 4, 6 ఏండ్ల పిల్లలకు, మరో ఆసుపత్రిలో 14 ఏండ్ల బాలికకు ఆపరేషన్ నిర్వహించి బ్లాక్ ఫంగస్ సోకిన ఒక్కో కనుగుడ్డును తొలగించారు. పిల్లలకు బ్లాక్ ఫంగస్ సోకడం ఆందోళన కలిగిస్తున్నదని వైద్యులు అన్నారు. కరోనా నుంచి కోలుకున్న 4, 6 ఏండ్ల వారికి మధుమేహం లేదని, 14 ఏండ్ల బాలికతోపాటు కరోనా నుంచి కోలుకున్న మరో 16 ఏండ్ల బాలికకు అనంతరం మధుమేహం వచ్చిందని డాక్టర్లు తెలిపారు. డయాబెటిస్ వంటి ఇతర అనారోగ్య సమస్యలున్న కరోనా రోగులను బ్లాక్ ఫంగస్ లక్ష్యంగా చేసుకుంటున్నదని, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇది ప్రమాదకరంగా మారుతున్నదని వెల్లడించారు.