గ్లోబల్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వన్ప్లస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్, సోదర సంస్థ ఒప్పోలో వన్ప్లస్ విలీనం కానున్నట్లు ప్రకటించింది. వన్ప్లస్ వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులను అందించేందుకు ఒప్పోతో విలీనం అవుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
వన్ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈవో పీట్ లా మాట్లాడుతూ.. ఈ విలీనం ద్వారా తమ కస్టమర్లకు మరింత సమర్థవంతంగా సర్వీసు అందించడానికి వీలుకల్పిస్తుందని అన్నారు. ఉదాహరణకు వన్ప్లస్ వినియోగదారులకు అత్యంత వేగంగా, మరింత స్థిరంగా సాఫ్ట్వేర్ అప్డేట్లను అందించవచ్చని పేర్కొన్నారు. గతేడాది వన్ప్లస్, ఒప్పో రెండింటికి సంబంధించి ప్రొడక్ట్ స్ట్రాటజీని పర్యవేక్షించడానికి అదనపు బాధ్యతలను స్వీకరించినట్లు ఆయన చెప్పారు.
అప్పటి నుంచి మా కార్యకలాపాలను మెరుగుపరచడానికి, మా బృందాలు అదనపు భాగస్వామ్య వనరులను వినియోగించుకోవడానికి ఒప్పోతో కలిసి పనిచేస్తున్నాం. ఆ మార్పుల నుంచి సానుకూల ప్రభావాన్ని చూసిన తర్వాత మా సంస్థను ఒప్పోతో విలీనం చేయాలని నిర్ణయించుకున్నట్లు లా చెప్పారు. వన్ప్లస్, ఒప్పో రెండు కూడా ప్రత్యేక బ్రాండ్లుగా స్వతంత్రంగా పనిచేయడం కొనసాగిస్తామయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.