బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఏడు పదుల వయస్సులోను కుర్ర హీరోలతో పోటీ పడి మరీ వర్క్ చేస్తున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్స్, మరో వైపు టీవీ షోస్తో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. కరోనా కాలంలోను అమితాబ్ వర్క్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. గత ఏడాది అమితాబ్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా రాగా, మంచి వైద్యం పొంది త్వరగానే కోలుకున్నారు.
ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో సెకండ్ వేవ్ విజృంభించడంతో షూటింగ్స్ చేయడం మానేశారు అమితాబ్. అయితే ఇప్పుడు కరోనా కాస్త శాంతించడంతో కొన్ని నిబంధనలతో ముంబైలో సినిమాల షూటింగ్లకు అనుమతి ఇచ్చారు. దీంతో లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్దమయ్యారు. తన సోషల్ మీడియాలో మాస్క్ ధరించి కారులో కూర్చొని దిగిన ఫొటోని షేర్ చేస్తూ..ఉదయం ఏడు గంటలు, పనికి వెళ్లేందుకు డ్రైవింగ్, లాక్డౌన్ 2.0 తర్వాత తొలి రోజు షూటింగ్.. . పాంగోలిన్ మాస్క్ … ఇకపై ప్రతీరోజూ మరింత మెరుగ్గా ఉండబోతోంది…. అని రాశారు. కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్- 13 షూటింగ్లో పాల్గొనేందుకు అమితాబ్ వెళుతున్నట్టు తెలుస్తుంది.