వీసీలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
నారాయణపేట, జూన్ 12 : నకిలీ విత్తనాలు విక్రయిస్తూ తరచుగా పట్టుబడితే అలాంటి నేరస్తులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం డీజీపీ మహేందర్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్రావు, సీడ్ డెవలప్మెంట్ అథారిటీ ఎండీ కేశవ్, నకిలీ విత్తనాల నిర్మూలన పోలీస్ నోడల్ అధికారి నాగిరెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీలు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. 10 రోజులుగా రాష్ట్రంలో నకిలీ, గడువు ముగిసిన విత్తనాలను పట్టుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులను అభినందించారు.
ఎస్పీ చేతన మాట్లాడుతూ జిల్లాలో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి దుకాణాలలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇంతవరకు నకిలీ, లూజు విత్తనాలు అమ్ముతున్న 8మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నకిలీ విత్తనాల నిర్మూలనకు పోలీ స్, వ్యవసాయశాఖ అధికారులు సమిష్టిగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. లోకల్ పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్ బృందాలను ఏ ర్పాటు చేసి నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై పటిష్టంగా నిఘా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీసీ లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్సుధాకర్, సీఐలు శ్రీకాంత్రెడ్డి, శంకర్, శివకుమార్, రామ్లాల్, ఎస్సైలు రాజు, చంద్రమోహన్రావు పాల్గొన్నారు.