ఆర్మూర్, జూన్ 12 : ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామం లో 63వ నంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా 600 మొక్కలు నాటేందుకు డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో గోపీబాబు శనివారం మార్కింగ్ చేశారు. ఈనెల 9వ తేదీన సీఎం కేసీఆర్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ ప్రయాణంలో జాతీయ రహదారి 63 వెంట రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. దీంతో శనివారం డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో గోపీబాబు, సర్పంచ్ టీసీ సాయన్న చేపూర్ శివారు నుంచి లక్కోర శివారు వరకు 63వ నంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా 600 మొక్కలు నాటేందుకు మార్కింగ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధిహామీ ఏపీవో సురేశ్, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.
బాల్కొండ, ముప్కాల్లో..
బాల్కొండ (ముప్కాల్), జూన్ 12 : జాతీయ రహదారి 44 వెంట రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు అడిషనల్ పీడీ సంజీవ్ బాల్కొండ, ముప్కాల్లో శనివారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి వెంట మొక్కలు నాటేందుకు సర్వే నిర్వహించినట్లు తెలిపారు. మొక్క ఎండిపోయిన చోట మరో మొక్కను నాటాలన్నారు. ఆయన వెంట బాల్కొండ, ముప్కాల్ ఎంపీడీవోలు సంతోష్కుమార్, దామోదర్, ఈవో గంగాధర్, ఏపీవో ఇందిర, వేంపల్లి ఉప సర్పంచ్ జక్క గంగాధర్ తదితరులు ఉన్నారు.
ఎంఎస్సీ ఫారంలో స్థలాన్ని పరిశీలించిన
అటవీ, ఆర్అండ్బీ శాఖల అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు స్థలాల ఎంపిక కోసం ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అటవీశాఖ, ఆర్అండ్బీ అధికారులు శనివారం పర్యటించారు. బోధన్- నిజామాబాద్ రహదారిలో రోడ్డు పక్కన, డివైడర్ల మధ్య మొక్కలు నాటేందుకు సంబంధిత ఆర్అండ్బీ అధికారులు స్థలాలను పరిశీలించారు. ఎడపల్లి మండలంలోని నెహ్రూనగర్ నుంచి ఎడపల్లి మండల కేంద్రం శివారు వరకు మొత్తం 11 కిలోమీటర్ల వరకు మొక్కలు నాటనున్నారు. ఇందులో భాగంగా సుమారు లక్ష మొక్కలు నాటేందుకు నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఎంఎస్సీఫారం గ్రామంలో ఉన్న అటవీశాఖకు చెందిన భూములను, ఆర్అండ్బీ శాఖ పరిధిలోని భూములను సంబంధిత అధికారులు పంచాయతీ సర్పంచ్ విజయ్కుమార్, కార్యదర్శి, సిబ్బందితో కలిసి పరిశీలించారు.