బేగంపేట్, జూన్ 9: ప్రభుత్వం సెలూన్లకు, లాండ్రీలకు ఉచితంగా ఇవ్వనున్న 250 యూనిట్ల విద్యుత్ కోసం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.ఆశన్న తెలిపారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ ఉచిత విద్యుత్ పొందే అర్హత వర్తిస్తుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులు బీసీ సంక్షేమ సంఘం శాఖలోని CGG ఆన్లైన్ పోర్టల్లోని TS OBMMS www.tsobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే, తహసీల్దార్చే జారీ చేయబడిన కులం పత్రం, లేబర్ లైసెన్స్, సెలూన్, లాండ్రీ ఫొటోలను జత చేయాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్లు లబ్ధిదారుల పేరిట మాత్రమే ఉండాలని తెలిపారు. విద్యుత్ వినియోగం 250 యూనిట్లు దాటితే మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడే చెల్లించాల్సి ఉంటుందన్నారు.