ఈ నెల 10న రేగుంటకు రాక
తెలంగాణ ఉద్యమకారుడు బాల్క సురేశ్ సంస్మరణ కార్యక్రమానికి హాజరు
విప్ సుమన్, కుటుంబసభ్యులకు పరామర్శ
హెలీప్యాడ్ను పరిశీలించిన విప్, కలెక్టర్
జగిత్యాల, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఆపదలో ‘నేనున్నాంటూ అభయమిచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు ఈ నెల 10వ తేదీన రేగుంటలో నిర్వహించే మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేశ్ సంస్మరణ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయిన విప్ బాల్క సుమన్ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. సురేశ్ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత పార్టీకి, మార్కెట్ కమిటీ చైర్మన్గా రైతులకు సేవలందించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ నెల 10న జగిత్యాల జిల్లా మెట్పల్లికి రాబోతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దివంగత బాల్క సురేశ్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మెట్పల్లి పట్టణ పరిధిలోని రేగుంటకు చెందిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి సురేశ్ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన విష యం విదితమే. 2004 నుంచి తెలంగాణ ఉద్యమంలో సురేశ్, అతడి తమ్ముడు మోహన్ చురుకైన పాత్ర పోషించారు. కాంగ్రెస్లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ, బాల్క సురేశ్ టీఆర్ఎస్లో చేరి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. జడ్పీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు అయిన కేవీ రాజేశ్వర్రావుకు గట్టి మద్దతుదారుడిగా నిలిచారు. రేగుంటతోపాటు, మెట్పల్లిలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సురేశ్ను టీఆర్ఎస్ అధిష్టానం గుర్తించింది. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. రైతుల సంక్షేమానికి బాల్క సురేశ్ నిరంతరం కృషి చేశారు. ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా, పరిస్థితి విషమించి మృతిచెందారు. సురేశ్ మృతి తదుపరి విప్ బాల్క సుమన్ను, అతడి కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పరామర్శించారు. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్, నిజామాబాద్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ వెంకటేశ్నేతకాని, పలువురు ఎమ్మెల్యేలు కూడా పరామర్శించి, సానుభూతిని తెలిపారు. బుధవారం రేగుంటలో సురేశ్ సంస్మరణ కార్యక్రమం నిర్వహించనుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి, మెట్పల్లిలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. మంగళవారం జగిత్యాల కలెక్టర్ గుగులోత్ రవి, జిల్లా అదనపు ఎస్పీ సురేశ్కుమార్, మెట్పల్లి డీఎస్పీ హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. విప్ బాల్క సుమన్ కూడా హెలీప్యాడ్ను పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనతో పాటు, ప్రత్యేక పోలీస్ విభాగాన్ని సైతం అధికారులు హెలీప్యాడ్ వద్ద ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందికి వివరించారు. ఈ నెల 10 సీఎం కేసీఆర్ రేగుంటకు వస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్రువీకరించారు.
మానవత్వం చాటిన పోలీసులు
ఇద్దరి ప్రాణాలు కాపాడిన వైనం
కరీంనగర్ రూరల్: జూన్ 8: గోపాల్పూర్ క్రాస్రోడ్డు వద్ద మంగళవారం రెండు బైక్లు ఢీకొన్నాయి. అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న రూరల్ ఎస్ఐ శ్రీనివాస్రావు పెట్రోలింగ్ వాహనంలో క్షతగాత్రుడిని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించి, అతడి ప్రాణాలు కాపాడారు. ఈ క్రమంలో ఎస్ఐ శ్రీనివాస్రావు, సిబ్బంది మిట్నాయక్, మల్లయ్య, పీసీ శ్రీపివాస్తో కలిసి స్టేషన్కు తిరిగివస్తుండగా, కరీంనగర్ వన్ టౌన్ పరిధిలో గల బంజేర్దొడ్డి ప్రాంతంలో మతిస్థిమితం లేని వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఎక్కి తీగలు పట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి పడిపోయాడు. వెంటనే సిబ్బంది సహకారంతో ఎస్ఐ శ్రీనివాస్రావు పెట్రోలింగ్ వాహనంలో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ, పోలీస్ సిబ్బంది అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి
ధర్మపురి, జూన్ 8: బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన బండ్ర తిరుపతి(35) వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగరీత్యా బైక్పై ధర్మపురికి వచ్చి తిరిగి గోపులాపూర్కు బయలుదేరాడు. ధర్మపురి పట్టణంలోని జగిత్యాల రోడ్డు వైపు గల లక్ష్మీనర్సింహ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొనడంతో తిరుపతి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. తిరుపతి సోదరుడు విష్ణువర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కిరణ్కుమార్ తెలిపారు.