సుల్తాన్బజార్, జూన్ 7: బ్లాక్ ఫంగస్ బారిన పడినవారికి హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖాన ఇతోధిక సేవలందిస్తున్నది. సోమవారం వరకు ఈ దవాఖానలో 378 మంది బ్లాక్ ఫంగస్ రోగులకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించారు. వీరిలో 99 శాతం మంది కోలుకున్నారని దవాఖాన సూపరింటెండెంట్, నోడల్ అధికారి డాక్టర్ తాటి శంకర్ వెల్లడించారు. ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించి తిరుగు పయనమైన వివిధ జిల్లాల డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ దవాఖానలో ఇంకా 90 మందికి సర్జరీలు చేయాల్సి ఉన్నదని విలేకర్లకు వివరించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న ఈ దవాఖానలో రోగులకు అవసరమైన మేరకు లిపోసోమల్ ఆంఫోటెరిసిన్-బీ, పూసకొనజోల్ ఇంజెక్షన్లు, పూసకొనజోల్ మాత్రలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే ఈ దవాఖానలోని రోగులకు పౌష్ఠికాహార ప్యాకెట్లను పంపిణీ చేసిన అక్షయపాత్ర ఫౌండేషన్కు డాక్టర్ శంకర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.