ఊట్కూర్ పీహెచ్సీ వైద్యుడు శ్రీకాంత్రెడ్డితో ఇంటర్వ్యూ
ఊట్కూర్, జూన్ 6 : వానకాలం ప్రారంభం కావడంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచివుంది. ఈ నేపథ్యంలో వ్యాధుల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలగురించి ఊట్కూర్ పీహెచ్సీ డాక్టర్ శ్రీకాంత్రెడ్డి వివరించారు.
నమస్తే తెలంగాణ : ప్రస్తుతం ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డాక్టర్ : వానకాలం ప్రారంభం కావడంతో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో అవగాహన కల్పించాం. అన్ని గ్రామాల్లో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించడంతో పాటు సీజనల్గా వచ్చే మలేరియా, డెంగ్యూ, డైయేరియా వ్యాధుల పట్ల అవగాహన కల్పించాం. 45 ఏండ్లు పైబడిన వారికి, ఫ్రంట్ వారియర్స్, సూపర్ స్పైడర్లకు కొవాగ్జిన్, కొవీషీల్డ్ టీకా వేస్తున్నాం. గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మురుగు నీటి గుంతలు, కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నాం.
నమస్తే తెలంగాణ : దవాఖానలో ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
డాక్టర్ : ఇద్దరు స్టాఫ్నర్సులతోపాటు పూర్తి స్థాయి సిబ్బందితో నిరంతర సేవలను అందిస్తున్నాం. వ్యాధులకు సంబందించిన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాం.
నమస్తే తెలంగాణ : పాము కాటుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా?
డాక్టర్ : ప్రత్యేకించి ప్రభుత్వం పాము కాటుకు గురైన వారికి ఏఎస్వీ, కుక్క కాటుకు ఏఆర్వీ వ్యాక్సిన్ను పంపిణీ చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు. నాటు వైద్యం జోలికి పోకుండా పాము కాటుకు గురైన వారిని నేరుగా దవాఖానకు తరలించాలి.
నమస్తే తెలంగాణ : కాన్పుల కోసం వచ్చేవారికి సౌకర్యాలు ఎలా ఉన్నాయి…
డాక్టర్: ప్రభుత్వ దవాఖానాలో కాన్పులు చేయించుకునే తల్లీ బిడ్డల సంక్షేమం కోరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్స్ను అందిస్తోంది. ఆడ బిడ్డ పుడితే రూ. 13 వేలు, మగ బిడ్డ పుడితే రూ. 12 వేలు లబ్దిదారుల ఖాతాలో నేరుగా జమ చేస్తుంది.