నిజామాబాద్, జూన్ 4, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తితో ఎదురవుతున్న కష్టాలతో పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్రంగా సతమతమవుతున్నాయి. వేగంగా విజృంభించిన వైరస్తో రాష్ట్రంలో రెండోసారి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా సామాన్య ప్రజల జీవన యా నం కష్టతరమైంది. పూట గడవడమే గగనమైన కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో నేనున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. గతేడాది లాక్డౌన్లోనూ ఫ్రీగా రేషన్ బియ్యం, కంది పప్పు పంపిణీ చేసిన సర్కా రు… ఈసారి కూడా మానవీయ కోణంలో ప్రజలకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. మే 12 నుంచి అమలవుతున్న నిర్బంధం మూలంగా ఉపాధి కరువైన వారంతా చేతిలో చిల్లి గవ్వలేక కష్టాలు అనుభవిస్తున్నారు. రేషన్ కార్డులున్న వా రందరికీ ఉపశమనం కలిగించేందుకు జూన్, జూలై నెలల్లో ఉచితంగా బియ్యం పంపిణీకి సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఆహార భద్రత కార్డులు, అంత్యోదయ, అన్నపూర్ణ లబ్ధిదారులందరికీ సాధారణ కోటాకు అదనంగా రెట్టింపు స్థాయిలో బియ్యం పంపిణీ చేయబోతున్నారు. నేటి నుంచే ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ఆయా రేషన్ దుకాణాల్లో ప్రారంభం కానుంది.
ఉమ్మడి జిల్లాలో 6.40 లక్షల కుటుంబాలు..
జూన్, జూలై నెలల్లో ప్రతి ఆహార భద్రత కార్డు లబ్ధిదారునికి ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వ యం త్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 6లక్షల 40వేల 811 కుటుంబాలకు రేషన్ కార్డులుండగా దాదాపుగా 20 లక్షల మంది లబ్ధిదారులున్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి కుటుంబానికీ మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. తిండి లేక పస్తులుండే పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు పేదలకు ఉచితంగా బి య్యం పంపిణీ చేస్తున్నది. సాధారణంగా ప్రతి నెలా ఆహార భద్రత కార్డులో ఒక్కొక్కరికీ ఆరు కిలోలు అందిస్తున్నారు. ఇప్పుడు అదనంగా 9 కిలోలు జోడించి ఉచితంగా మొత్తం 15 కిలోలు బియ్యం సరఫరా చేయబోతున్నారు. అంత్యోదయ కార్డుదారులకు సాధారణ కోటా కింద 35 కిలోలు బియ్యం అందుతున్నాయి. ఉదాహరణకు ఒక రేషన్ కార్డు పరిధిలో ఐదుగురు కుటుంబీకులుంటే వారికి జూన్ నెలలో 75 కిలోలు బియ్యం అందిస్తారు. జూలైలోనూ ఇదే తరహాలో అందిస్తారు. అంత్యోదయ కార్డుదారులకు సాధారణ కోటా పరిధిలో 35 కిలోలు బియ్యం అందుతుండగా అదనంగా 10 కిలోలు చేర్చారు. జూన్, జూలైలో వీరికి ప్రతి లబ్ధిదారునికీ 45 కిలోలు బియ్యం పంపిణీ చేస్తారు. అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు కోటా అందుతుండగా అదనంగా మరో 10 కిలోలు చొప్పున మొత్తం ఒక్కో లబ్ధిదారునికి 20కిలోలు బియ్యం పంపిణీ చేస్తారు.
నేటి నుంచి పంపిణీ..
కరోనా రెండో దశ తీవ్రత నేపథ్యంలో పేదలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కార్డుదారులకు కిలో రూపాయి చొప్పున ఆరు కిలోల బియ్యాన్ని చౌక ధరల దుకాణాల నుంచి తీసుకుంటున్నారు. గతేడాది లాక్డౌన్ అమలు సమయంలోనూ ఇలాగే రెండు నెలల పాటు ఉచితంగా బియ్యాన్ని అందుకున్న వారంతా ఈసారి కూడా అందిస్తారని ఆశించగా ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా అధికంగా ఉన్నందున కొవిడ్ నిబంధనల ప్రకారం బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. దాదాపు ఎక్కువ మంది కార్డుదారులు ఓటీపీతోనే సరుకులు తీసుకుంటున్నారు. గత ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో బి య్యం తీసుకున్న వారి సంఖ్య తగ్గింది. ఏప్రిల్ నెలలో కేసుల సంఖ్య అంతగా లేకపోవడం కారణంగా నిలుస్తున్నది. మే నెలలో కేసులు పెరగడం, ఆంక్షలు అమల్లోకి రావడంతో ప్రజలు కూడా కాసింత భయాందోళనకు గురయ్యారు. రేషన్ డీలర్లను ఇప్పటికే సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి ప్రభు త్వం వారికి టీకాలు ఇచ్చింది. తద్వారా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నది.
ఓటీపీ లేదా ఐరిస్…
రేషన్కార్డు లబ్ధిదారులు ఆధార్ను అనుసంధానం చేసుకొని రేషన్ పొందాల్సి ఉంటుంది. కరోనా వ్యాపిస్తున్నందున గతంలో రేషన్ దుకాణాల్లో అమలయ్యే బయోమెట్రిక్ విధానానికి స్వస్తి పలికారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నూతన విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. బియ్యాన్ని తీసుకొనే ప్రతి కార్డుదారుడు తమ కుటుంబంలోని ఎవరో ఒకరి మొబైల్ ఫోన్ నంబర్ను ఆధార్తో అనుసంధానం చేయించుకోవాలి. దానికి అందే ఓటీపీ ఆధారంగానే కచ్చితంగా సరుకులను పంపి ణీ చేసేలా డీలర్లకు ప్రభుత్వం సూచనలు చేసింది. కానీ ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకు ఆధార్ అనుసంధానం విషయంలో అనుకున్నంత వేగం గా పురోగతి కనిపించలేదు. ఈ -పాస్లో కార్డుదారుల వివరాలతో పాటు అనుసంధానాన్ని చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. నూతన విధానం అమల్లోకి రాకపోవడంతో చాలా మందికి ఓటీపీ రూపంలో సరుకు లు పంపిణీ చెల్లుబాటు కావడం లేదు. ఐరిస్ ద్వారా సరుకులు తీసుకోవడమే తప్ప వేరే మార్గం లేకుండా పోయింది.