సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): డ్రైవరన్నలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఆటో, క్యాబ్, మ్యాక్సీ డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం గ్రేటర్లో 10 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతీ డ్రైవర్ వ్యాక్సిన్ వేయించుకునేలా ట్రాన్స్పోర్ట్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం 20 రోజుల పాటు కొనసాగనుంది. ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్లో సైతం వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. కరోనా ఆపత్కాలంలో పేషంట్లు, వారి బంధువులు, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్లదీ కీలక పాత్ర. ఈ క్రమంలో ఇటీవల చాలా మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు కరోనా బారినపడ్డారు. కొంతమంది మరణించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వారిపట్ల సానుకూలంగా స్పందించి వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉచితంగా చేపట్టింది. ప్రభుత్వ అధికారులు దగ్గరుండి మరీ డ్రైవర్లకు వ్యాక్సిన్ వేయిస్తుండటం విశేషం. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవర్లు అందరూ వ్యాక్సినేషన్ ప్రక్రియను వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలి. వ్యాక్సిన్పై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – వి.శ్రీనివాస రెడ్డి, ఆర్టీఓ, సికింద్రాబాద్
మా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న తెలంగాణ సర్కార్కు రుణపడి ఉంటాం. డ్రైవర్లకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ చేపట్టడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ట్రాన్స్పోర్టు అధికారులు దగ్గరుండి వ్యాక్సిన్ వేయిస్తున్నారు. అనేక మంది డ్రైవర్లు ఇప్పటికే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. -బి.రాజుగౌడ్, డ్రైవర్
సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో 10 కేంద్రాల్లో 20 రోజుల పాటు 2 లక్షలకు పైగా ఉన్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సినేషన్ చేపట్టనున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. కొవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే డ్రైవర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నామని అధికారులు వివరించారు. కార్యక్రమంలో రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ ఎంఆర్ఎం రావు, కలెక్టర్ శ్వేతా మహంతి, డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ కె.పాపారావు, సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.
డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. కరోనా ఆపత్కాలంలో చేయూతనిస్తున్నది. గతేడాది మోటారు పన్నును రద్దు చేసింది. ఈ సంవత్సరం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉంది. ప్రతి డ్రైవర్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ప్రయాణికుల సేవే లక్ష్యంగా పని చేసే మాకు టీకా ఎంతో ధైర్యం చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. – సత్తిరెడ్డి, ఆటో యూనియన్ నాయకులు
రవాణా శాఖాధికారులు వ్యాక్సిన్ తీసుకోవాలని ఫోన్లు చేసి చెబుతున్నారు. కరోనా భయాకన పరిస్థితుల్లో వ్యాక్సిన్ ప్రాధాన్యతను వివరిస్తున్నారు. నేను వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకోలేదు. అధికారులు అర్థమయ్యేలా చెప్పడంతో టీకా తీసుకున్నా. మా ఆరోగ్యం గురించి ఆలోచించి అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – వెంకటేశ్, ఆటో డ్రైవర్