న్యూఢిల్లీ : రాబోయే 12 గంటల్లో యాస్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావర శాఖ మంగళవారం అంచనా వేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను గత ఆరు గంటల్లో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయువ్య దిశగా కదిలిందని పేర్కొంది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో పారాదీప్కు ఆగ్నేయ దిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బుధవారం సాయంత్రం వరకు తుఫాను ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.
తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల వర్షం కురుస్తున్నది. తుఫాను నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి సోమవారం ఏపీ, ఒడిశా, బెంగాల్ ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్తో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కేంద్ర శాఖలు అన్ని విధాలుగా సహకరిస్తాయని హామీ ఇచ్చారు. సాధ్యమైనంత మేరకు విద్యుత్పత్తి కేంద్రాల్లో సరఫరా నిలిచిపోకుండా చూడాలని కోరారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై తుఫాను ప్రభావం, వాటి రక్షణపై చర్చించారు. రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు అధికంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరమైతే తాత్కాలిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.