ప్రాణవాయువు కొరత తీర్చేందుకు రాచకొండ పోలీసులు, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చాయి. ఐసొలేషన్లో ఉండి ఆక్సిజన్ సిలిండర్ కోసం ఇబ్బందులు పడుతున్న వారి కోసం రాచకొండ సీపీ మహేశ్భగవత్, ఆర్కేసీ కలిసి ఆక్సిజన్ బ్యాంక్ను శనివారం ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కేవలం ఆక్సిజన్ కోసం దవాఖానల్లో చేరుతున్నవారు.. ఇంటి వద్ద ఐసొలేషన్లో ఆక్సిజన్ అవసరం ఉన్నవారు ఆక్సిజన్ బ్యాంక్ను ఉపయోగించుకోవాలన్నారు. దీని కోసం రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూం 9490617234కు వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డు, వైద్యుల ప్రిస్కిప్షన్, లొకేషన్ పెడితే ఆక్సిజన్ సిలిండర్లను ఇంటి వద్దకే పంపిస్తామన్నారు. అయితే.. అవసరం ఉన్నంత వరకు ఈ సిలిండర్ను ఉపయోగించుకుని.. ఆ తర్వాత మరొకరికి ఉపయోగపడేలా వ్యవహరించాలని సీపీ సూచించారు. ప్రస్తుతం ఈ ఆక్సిజన్ బ్యాంక్లో దాదాపు 20 సిలిండర్లకు పైగా నిల్వ ఉన్నాయి. వీటికి కేవలం రీఫిల్లింగ్ చార్జీలను మాత్రమే తీసుకుంటారని ప్రతినిధులు తెలిపారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కోసం ప్రాణవాయువు అవసరమైతే.. వారి కోసం కొన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో పెట్టామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న డీఆర్డీఓ, హెట్చ్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్, సెకండ్ చాన్స్ ఫౌండేషన్ ప్రతినిధులను సీపీ అభినందించి వారిని సత్కరించారు. కార్యక్రమంలో అదనపు సీపీ సుధీర్బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత, అడ్మిన్ డీసీపీ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.