మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలపారు. సోమవారం ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్వీకర్ణన్, కొత్తగూడెంలోని కలెక్టరేట్లో కలెక్టర్ ఎంవీరెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో ఇంటింటా జ్వర సర్వే చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో పడకలు ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తారని అన్నారు. ఆయా సమావేశాల్లో జడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.