కోర్టు విచారణలు తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది
సుప్రీంకోర్టు వెల్లడి.. ఈసీ పిటిషన్ కొట్టేవేత
న్యూఢిల్లీ, మే 6: కోర్టుల్లో జరిగే న్యాయ విచారణల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉన్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదనలను మీడియా ప్రసారం చేయకుండా నియంత్రించాలని ఎన్నికల సంఘం (ఈసీ) దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. మీడియాకు స్వేచ్ఛ ఉండాలనే అంశాన్ని తాము బలంగా నమ్ముతామని జస్టిస్లు డీవై చంద్రచూడ్, ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయ విచారణ పారదర్శకంగా ఉంటేనే ప్రజల నమ్మకాన్ని చూరగొంటామని పేర్కొంది. దేశంలో కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికల సభలకు అనుమతులనివ్వడాన్ని తప్పుబడుతూ ఈసీపై మద్రాస్ హైకోర్టు ఇటీవల మండిపడింది. దేశంలో కేసుల పెరుగుదలకు మీరే కారణమని, మీపై (ఈసీపై)హత్యానేరం ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలని ప్రశ్నించింది. దీన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో కోర్టుల్లో జరిగే న్యాయ విచారణ రిపోర్టింగ్కు సంబంధించి మీడియా మీద నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టులో ఈసీ పిటిషన్ వేసింది.