దుబ్బాక, మే 6 : అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షంతో వరి ధాన్యం తడిసిపోయింది. ఈ విషయంపై మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డి స్పందించారు. మార్కెట్ యార్డు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, మార్కెట్ కమిటీ, పీఏసీఎస్ పాలకవర్గాలకు పలు సూచనలు చేసినట్లు వివరించారు. గురువారం సాయంత్రం ‘నమస్తే తెలంగాణ’తో ఎంపీ ప్రభాకర్రెడ్డి ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షానికి యార్డు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసే బాధ్యత తమదేనన్నారు. రైతులు అధైర్య పడొద్దన్నారు. ఈ విషయంపై మంత్రి హరీశ్రావు, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా 145 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అకాల వర్షంతో కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ రైతుల నుంచి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇందులో ప్రతి పక్షాలు రాజకీయాలు చేయటం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.