బాన్సువాడ రూరల్, మే 4 : కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ హోం ఐసొలేషన్ కిట్లు అందించాలని, హోం ఐసోలేషన్ వసతి సౌకర్యం లేని వారికి ప్రభుత్వ కొవిడ్ కేంద్రంలో చికిత్స అందించాలని కామారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. మండల అభివృద్ధి కార్యాలయంలో ఆర్డీవో రాజాగౌడ్, డిప్యూటీ డీఎంహెచ్వో మోహన్బాబు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, పోలీసు అధికారులతో మంగళవారం డివిజన్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్, కరోనా నియంత్రణ చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కొవిడ్ సంక్షోభ సమయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కరోనా కట్టడికి కృషి చేయాలని అన్నారు.
ప్రైమరీ కాంటాక్టులు, కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐసొలేషన్లో ఉంచాలన్నారు. కొన్నిచోట్ల పాజిటివ్ వచ్చిన వారు బయట తిరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు, మెడికల్ ఆఫీసర్లు, ఎస్హెచ్వోతో కూడిన పోలీసు టీమ్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, వీఆర్వోలతో కూడిన బృందం పాజిటివ్ వచ్చిన వారి ఇంటిని సందర్శించాలన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి పేరు, ఏ రోజు ఏ సమయంలో ఆ ఇంటిని సందర్శించారు, వారి ఆరోగ్య పరిస్థితిని రిజిష్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేసుకునే మందులు, కరోనా బాధితుడు బయట తిరిగితే కలిగే అనర్థాలను కుటుంబ సభ్యులకు వివరించి సరైన అవగాహన కల్పించాలని అన్నారు.
గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలన్నారు. ఆశ వర్కర్లు లేని గ్రామాల్లో తాత్కాలికంగా ఆశ వర్కర్లను నియమించుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని వందశాతం సాధించాలని, వీఆర్ఏలు, వీఆర్వోల సహాయంతో గ్రామాల్లో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని సూచించారు. అందరూ సమన్వయంతో పని చేస్తేనే సత్ఫలితాలు వస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బాన్సువాడ ఏరియా దవాఖానలో వంద కొవిడ్ బెడ్లతో వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వోకు ఆదేశించారు. దీంతో పాటు ప్రైవేటు దవాఖానల్లో 50శాతం కొవిడ్ బెడ్లు ఏర్పాటు చేసి చికిత్స అందేలా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. అనధికారికంగా ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకోవాలని ఆర్డీవో, పోలీసు అధికారులకు సూచించారు. గ్రామాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, గుంపులుగా తిరగనివ్వొద్దని, అవసరమైన చోట 144 సెక్షన్ విధించాలని సూచించారు. దుకాణాల్లో తప్పని సరిగా మాస్కు ధరించిన వారికే వస్తువులు విక్రయించాలని, నిబంధనలు పాటించని దుకాణాదారులపై చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ బృందాలకు కలెక్టర్ ఆదేశించారు.